అవినాశ్ రెడ్డికి బిగ్ రిలీఫ్.. ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు…
- వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్ రెడ్డి
- షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
- సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం
వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనకు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. బెయిల్ కు సంబంధించి కొన్ని షరతులు విధించింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న అవినాశ్ ను ఈ రోజు వరకు అరెస్ట్ చేయవద్దని సీబీఐకి గత శనివారం వాదనల సందర్భంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బెయిల్ మంజూరు చేయంతో అవినాశ్ కు బిగ్ రిలీఫ్ లభించినట్టయింది. హైకోర్టు విధించిన షరతులు ఏమిటనేది కాసేపట్లో తెలియనుంది. మరోవైపు, హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో వివేకా కుమార్తె సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ విషయంలో హైకోర్టు విధించిన 5 షరతులు ఇవే!
- సీబీఐకి సమాచారం ఇవ్వకుండా దేశం విడిచి వెళ్లకూడదన్న హైకోర్టు
- ప్రతి శనివారం సీబీఐ విచారణకు హాజరుకావాలని ఆదేశం
- బెయిల్ నిబంధనలను ఉల్లంఘిస్తే కోర్టుకు వెళ్లొచ్చని సీబీఐకి సూచన
వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించిన సంగతి తెలిసిందే. అవినాశ్ కు హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ. 5 లక్షల పూచీకత్తుతో రెండు షూరిటీలను సమర్పించాలని ఆదేశించింది. సీబీఐకి సమాచారం ఇవ్వకుండా దేశం విడిచి వెళ్లకూడదని షరతు విధించింది.
ఇక సాక్షులను భయపెట్టడం, ఆధారాలను చెరపడం వంటివి చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ విచారణకు సహకరించాలని ఆదేశించింది. ప్రతి శనివారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీబీఐ ఎదుట విచారణకు హాజరు కావాలని తెలిపింది. బెయిల్ నిబంధనలను ఉల్లంఘిస్తే కోర్టుకు వెళ్లొచ్చని సీబీఐకి సూచించింది. వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి పాత్రకు సంబంధించి ఒక్క ఆధారాన్ని కూడా సీబీఐ చూపెట్టలేకపోయిందని తీర్పులో హైకోర్టు పేర్కొంది.