Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పంజాబ్ సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణం..

పంజాబ్ సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణం..
మనకు ఓటు వేయని వారిపై ద్వేషం చూపద్దన్న సీఎం
భగత్ సింగ్ పుట్టిన ఊరిలో ప్రమాణం
వేలాదిగా తరలివచ్చిన జనం
పసుపు రంగు తలపాగాలతో మద్దతు
కేజ్రీవాల్ సహా పలువురు ప్రముఖుల హాజరు

పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణం చేశారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. భగత్ సింగ్ పుట్టిన గ్రామమైన నవన్ షహర్ జిల్లాలోని ఖాట్కర్ కలాన్ లో ఆయన ప్రమాణం చేశారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అన్న భగత్ సింగ్ నినాదంతోనే తన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ముగించారు.

ప్రమాణ స్వీకారం అనంతరం తన సహచర ఎమ్మెల్యేలకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఓ విజ్ఞప్తి చేశారు. ‘‘మనకు ఓటు వేయని ప్రజలపై కోపం, విద్వేషం చూపించవద్దు. వారినీ మనం గౌరవించి తీరాల్సిందే. మీ అందరికీ, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు నా కృతజ్ఞతలు’’ అని అన్నారు.

ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సహా పలువురు ప్రముఖులు భగవంత్ మాన్ ప్రమాణ కార్యక్రమానికి హాజరయ్యారు. వేలాది మంది ప్రజలు ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేశారు. పసుపు రంగు తలపాగాలు చుట్టుకుని భగవంత్ మాన్ కు మద్దతు తెలిపారు. కేజ్రీవాల్, సిసోడియా కూడా పసుపు రంగు పాగాల్లో రావడం విశేషం. ప్రమాణ స్వీకార వేదిక వద్ద పది వేల మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు.

కాగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో 117 స్థానాల్లో పోటీ చేసిన ఆప్.. 92 స్థానాలను గెలిచి అధికారాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్, బీజేపీ, ఇతర ముఖ్య పార్టీలను పంజాబ్ గడ్డపై ఆ పార్టీ మట్టికరిపించింది. సంగ్రూర్ జిల్లా ధూరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన భగవంత్ మాన్.. కాంగ్రెస్ అభ్యర్థి దల్వీర్ సింగ్ గోల్డీపై 58 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

సీఎం సీట్లో భ‌గ‌వంత్‌!.. ఆఫీస్‌లో భ‌గ‌త్ సింగ్‌, అంబేద్క‌ర్ ఫొటోలు మాత్రమే!

ఆమ్ ఆద్మీ పార్టీ నేత భ‌గ‌వంత్ మాన్ బుధ‌వారం మ‌ధ్యాహ్నం పంజాబ్ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన సంగ‌తి తెలిసిందే. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు భ‌గ‌త్ సింగ్ స్వ‌గ్రామం ఖ‌త్క‌ర్ క‌లాన్‌లో ప్ర‌మాణ స్వీకారం పూర్తి చేసిన భ‌గ‌వంత్‌.. ఛండీగ‌ఢ్‌లోని పంజాబ్ సివిల్ సెక్ర‌టేరియ‌ట్‌కు చేరుకున్నారు. సెక్ర‌టేరియ‌ట్‌లోని సీఎం ఛాంబ‌ర్‌లోకి ప్ర‌వేశించిన మాన్‌.. సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

ఈ సంద‌ర్భంగా సీఎం ఛాంబ‌ర్‌లో ఆస‌క్తిక‌ర దృశ్యం క‌నిపించింది. భ‌గ‌వంత్ మాన్ సీటు వెనుక గోడ‌ల‌పై భ‌గ‌త్ సింగ్ ఫొటోతో పాటు రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ ఫొటో మాత్ర‌మే క‌నిపించింది. ఎన్నిక‌ల ఫలితాలు వెలువ‌డిన స‌మ‌యంలో ఆప్ విజ‌యం ఖ‌రారైన మ‌రుక్ష‌ణ‌మే పార్టీ కార్యక‌ర్త‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించిన మాన్‌.. త‌న కార్యాల‌యంలో భ‌గ‌త్ సింగ్‌, అంబేద్క‌ర్ ఫొటోలు మాత్ర‌మే ఉంటాయ‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఆ మేర‌కే త‌న కార్యాల‌యంలో వారిద్ద‌రి ఫొటోలు మిన‌హా మ‌రే ఫొటోను కూడా మాన్ అనుమ‌తించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Related posts

రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఆర్.కృష్ణ‌య్య ప్ర‌మాణం… ఆ వెంట‌నే జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ధర్నా!

Drukpadam

అచ్చెన్నాయుడు హౌస్ అరెస్ట్.. ఇంటి చుట్టూ పోలీసులు!

Drukpadam

రాహుల్ రైలు ప్రయాణం …ఢిల్లీ టు ఉదయ్ పూర్!

Drukpadam

Leave a Comment