తెలంగాణలో కుమ్మేస్తున్న భారీ వర్షాలు…
పలు రైళ్ల రద్దు, పరీక్షలు వాయిదా వేసిన కాకతీయ, ఉస్మానియా
- గత కొన్నిరోజులుగా విస్తారంగా వర్షాలు
- విద్యాసంస్థలకు మూడ్రోజుల సెలవులు
- రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
- డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా
![](https://i0.wp.com/drukpadam.com/wp-content/uploads/2022/07/image_7a9c4f74-ad12-4e30-8208-239a73e565ab-239x300.jpg?resize=239%2C300&ssl=1)
![](https://i0.wp.com/drukpadam.com/wp-content/uploads/2022/07/image_f5261ff3-9306-4dd5-afad-1d011420d530-300x174.jpg?resize=300%2C174&ssl=1)
ఎగువ నుంచి వస్తున్న వరదలతో పాటు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరి నది ప్రవాహ ఉద్ధృతి కొనసాగుతూ 53 అడుగులు దాటింది దీంతో మూడో ప్రమాద హెచ్చరిక ను అధికారులు జారీ చేశారు.
భద్రాచలం వద్ద గోదావరి నది నీటి ప్రవాహాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వయంగా పరిశీలించారు. ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ అధికారులతో మంత్రి అజయ్ సమీక్షించారు.
గోదావరి వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
గత రెండు రోజులుగా వర్షాలు, వరదల పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రజలకు, అధికారులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచనలు చేస్తున్నారు.
గోదావరి వద్ద మూడో ప్రమాద హెచ్చరిక సైతం జారీ చేసిన నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ సౌకర్యం, ఇతర మౌళిక సదుపాయాల విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సత్వర కార్యచరణ రూపొందించాలని సూచించారు.
కాలువలు, చెరువులు, కుంటలు, చెక్ డ్యామ్స్ వద్ద కూడా రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, విద్యుత్, పోలీసు, ఆరోగ్య శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పని చేయాలని చెప్పారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు.
రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, రిజర్వాయర్లు జలకళతో తొణికిసలాడుతున్నాయి. జలాశయాలకు వరద నీరు పోటెత్తుతోంది. హైదరాబాదులో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. పలు చోట్ల నాలాలు, డ్రైనేజీలు ఉప్పొంగుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం మూడ్రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. కాగా, భారీ వర్షాల ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది.
అటు, పలు జిల్లాలు భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల పరిధిలో జరగాల్సిన పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. నేడు, రేపు జరగాల్సిన డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదాపడ్డాయి. పరీక్షలు జరిగే కొత్త తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు.