Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన 13 మండలాలు..ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం !

తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన 13 మండలాలు..ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం !
-పలు జిల్లాల్లో కొత్త మండలాలు
-ప్రజల ఆకాంక్షలు, స్థానిక అవసరాల ప్రాతిపదికన ఏర్పాటు
-సీఎం కేసీఆర్ ఆదేశాలతో సీఎస్ ఉత్తర్వులు
-ఖమ్మం జిల్లాలోని సుబ్లేడ్ మండల డిమాండ్ ను పట్టించుకోని ప్రభుత్వం

రాష్ట్రంలో పాలనా సంస్కరణల అమలు మరింత సులభతరం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం నూతన మండలాలు ఏర్పాటు చేసింది. ప్రజల ఆకాంక్షలను, స్థానిక ప్రజా అవసరాలను పరిగణనలోకి తీసుకుని కొత్త మండలాలు ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ నూతన మండలాల ఏర్పాటుపై ఉత్తర్వులు జారీ చేశారు.

కొత్తగా ఏర్పడిన మండలాల వివరాలు…

నారాయణపేట జిల్లా- గుండుమల్, కొత్తపల్లె
వికారాబాద్ జిల్లా- దుడ్యాల్
నిజామాబాద్ జిల్లా- ఆలూర్, డొంకేశ్వర్, సాలూర
మహబూబ్ నగర్ జిల్లా- కౌకుంట్ల
కామారెడ్డి జిల్లా- డోంగ్లి
జగిత్యాల జిల్లా- ఎండపల్లి, భీమారం
మహబూబాబాద్ జిల్లా- సీరోల్
నల్గొండ జిల్లా- గట్టుప్పల్
సంగారెడ్డి జిల్లా- నిజాంపేట్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఇప్పటికే నూతన జిల్లాలను, రెవెన్యూ డివిజన్లను, మండలాలను కేసీఆర్ సర్కార్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే కొత్త మండాల ఏర్పాటు సైతం మరికొన్ని చోట్ల కూడా కొత్త మండలాలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు అక్కడి ప్రజల నుంచి వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మరికొన్ని మండలాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు. ఈనేపథ్యంలో సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాల్లో నూతన మండలాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మునుగోడు పై ముందు చూపు ….ఉపఎన్నిక ప్రచారం కొత్త మండలం ఏర్పాటు

అయితే.. మునుగోడు నియోజకవర్గంలో గట్టుప్పల్ మండలం ఏర్పాటు చేయాలని స్థానికులు చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఆ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఖాయమనే వార్తలు రెండు రోజులుగా జోరుగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు సైతం ఉన్నాయంటూ మీడియా కోడై కూస్తోంది. దీంతో అప్రమత్తమైన సీఎం కేసీఆర్ మునుగోడుపై ఫోకస్ పెంచారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి మంత్రి జగదీశ్ రెడ్డితో ఈ విషయంపై చర్చలు జరిపారు.

మునుగోడు నియోజకర్గంలో చేేపట్టాల్సి ఉన్న అభివృద్ధి పనులు, పెండింగ్ లో ఉన్న ప్రజల డిమాండ్లపై ద్రుష్టి సారించాలని మంత్రికి సీఎం పురమాయించారు .ఇదిలా ఉంటే.. నిన్న ఓ మీడియాతో మాట్లాడిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఈ రోజు సాయంత్రంలోగా గట్టుప్పల్ మండలంపై ప్రకటన రాబోతుందన్నారు . సీఎం కేసీఆర్ ఉప ఎన్నిక కోసమే ఈ మండలాన్ని ప్రకటించబోతున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు . ఆయన చెప్పినట్లుగా ఈ రోజు గట్టుప్పల్ మండలం ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి ప్రకటన రావడం గమనార్హం.

ఖమ్మం జిల్లాలోని సుబ్లేడ్ మండల డిమాండ్ ను పట్టించుకోని ప్రభుత్వం

ఖమ్మం జిల్లాలోని సుబ్లేడ్ మండల డిమాండ్ ను ప్రభుత్వం పట్టించుకోలేదు . తిరుమలాయపాలెం మండల మరిదితో ఉన్న సుబ్లేడ్ కేంద్రంగా మండలం ఏర్పడితే చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాలకు ఉపయోగంగా ఉంటుందని స్థానికుల అభిప్రాయం . మిగతా మండలతో పోల్చితే ప్రజల డిమాండ్ న్యాయసమ్మతమైనదే అనే అభిప్రాయాలూ ఉన్నాయి. గత కొంతకాలంగా స్థానికులు దీనిపై ఆందోళనలు చేస్తున్నారు . ఒక్క సుబ్లేడ్ కేంద్రంగా మండల ఏర్పాటు డిమాండ్ ఉన్నా , తిరుమలాయపాలెం మండలమే కాకుండా పాలేరు నియోజకవర్గంలో ఉన్న కూసుమంచి , నేలకొండపల్లి , ఖమ్మం రూరల్ మండలాలు కూడా అత్యధిక జనాభా కలిగి ఉన్నాయి. మండల కేంద్రాలు గ్రామాలకు దూరంగానే ఉన్నాయి. అందువల్ల మండల కేంద్రం అందుబాటులో ఉండాలనే డిమాండ్ ప్రజల నుంచి వస్తుంది.

Related posts

పేదింటి ఆడ పిల్ల ఇంట్లో చిరునవ్వులు చిందించాలనే కల్యాణలక్ష్మి.. మంత్రి పువ్వాడ!

Drukpadam

జీతాలు తగ్గింది ఎక్కడ?… చెబితేనే కదా మాకు తెలిసేది:సీఎస్ సమీర్ శర్మ

Drukpadam

The Secrets of Beauty In Eating A Balanced Diet

Drukpadam

Leave a Comment