కేంద్ర దర్యాప్తు సంస్థలపట్ల జాగ్రత్త :మంత్రులతో కేసీఆర్!
సీబీఐ, ఈడీ ఐటీ సంస్థలు మనపై పడతాయని వార్నింగ్
కేబినెట్ భేటీలో కేంద్రం తీరును ప్రస్తావించిన కేసీఆర్
సీబీఐ విచారణ విషయంలో రాష్ట్రాల అనుమతి తప్పనిసరి అయ్యేలా చూద్దామని వ్యాఖ్య
కేంద్ర మంత్రుల దండయాత్ర మరింత పెరుగుతుందన్న సీఎం
దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని యుద్ధం కేద్రంపై కేసీఆర్ చేస్తున్నాడు … అనేక రాష్ట్రాల్లో కేంద్ర సిబిఐ , ఈడీ, ఐటీ సంస్థలను ఉపయోగించి తనవైపు రాజకీయాలను ఎలా మలుచుకుంటుందో చూస్తున్నాం అదే తెలంగాణాలో కూడా జరిగే ఆవకాశం ఉంది. మంత్రులు సదా అప్రమత్తంగా ఉండాలి ..అని కేసీఆర్ అలర్ట్ చేశారు . కేంద్రంపై యుద్ధం మరింత కొనసాగుతుందని కూడా సంకేతాలు ఇచ్చారు . కేంద్రం రాష్ట్రాలపట్ల అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా ఖండించారు . ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై కేంద్రం చూపుతున్న వివక్షతను మరోసారి మంత్రి వర్గ భేటీలో సీఎం వివరించారు .
తెలంగాణ కేబినెట్ భేటీలో భాగంగా సీఎం కేసీఆర్ తన మంత్రివర్గ సహచరులకు పలు సలహాలు, సూచనలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు మనపై పడబోతోందని చెప్పిన కేసీఆర్… ఎలాంటి తప్పులకు అవకాశాలు లేకుండా జాగ్రత్తగా ఉండాలంటూ ఆయన మంత్రులకు సూచించారు. తనకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలపై బీజేపీ వ్యవహరిస్తున్న తీరును గుర్తు చేసిన కేసీఆర్… నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలు మనపై పడతాయని, ఆ సంస్థలకు అవకాశం ఇచ్చే పనులు చేయరాదని హితబోధ చేశారు. బీజేపీ నుంచి ఎదురయ్యే ఎలాంటి దాడులకైనా అందరూ సిద్ధంగానే ఉండాలని కేసీఆర్ సూచించారు. సీబీఐ విచారణల విషయంలో రాష్ట్రాల అనుమతి తప్పనిసరి చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొద్దామని ఆయన అన్నారు. ఈ విషయంలో అవసరమైతే న్యాయ పోరాటం చేద్దామని కూడా కేసీఆర్ అన్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రుల దండయాత్ర మొదలైందని, భవిష్యత్తులో మరింత మేర పెరుగుతుందని అన్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్ర మంత్రులు అలసత్వంగా ఉండొద్దని కేసీఆర్ సూచించారు.
సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినం: తెలంగాణ కేబినెట్ నిర్ణయం
అంతేకాకుండా సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని కూడా కేబినెట్ తీర్మానించింది. అంతేకాకుండా ఈ నెల 16,17,18 తేదీల్లో జాతీయ సమైక్యతా దినోత్సవాల్లో భాగంగా వజ్రోత్సవాలను నిర్వహించాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. వజ్రోత్సవాల్లో భాగంగా ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని తీర్మానించింది.