రికార్డు స్థాయిలో రూ.24.60 లక్షల ధర పలికిన బాలాపూర్ లడ్డూ… సొంతం చేసుకున్న వంగేటి లక్ష్మారెడ్డి
హోరాహోరీగా బాలాపూర్ లడ్డూ వేలం
ఉత్సవ కమిటీ సభ్యుడికే లడ్డూ సొంతం
ఘనంగా సన్మానించిన ఇతర సభ్యులు
వచ్చే ఏడాది డబ్బు చెల్లించనున్న లక్ష్మారెడ్డి
బాండ్ పేపర్ పై సంతకం
బాలాపూర్ గణేశ్ లడ్డూ తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది. గతేడాది ధరను మించిపోయి ఈసారి రికార్డు స్థాయిలో రూ.24.60 లక్షల ధర పలికింది. వంగేటి లక్ష్మారెడ్డి అనే వ్యక్తి బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకున్నారు. బాలాపూర్ గ్రామం సెంటర్లోని బొడ్రాయి వద్ద ఈ వేలం నిర్వహించారు. లడ్డూను సొంతం చేసుకున్న లక్ష్మారెడ్డికి బాలాపూర్ గణేశ్ మండపం నిర్వాహకులు లడ్డూను అందించారు. ఆయనకు శాలువాను కప్పి సన్మానం చేశారు.
వంగేటి లక్ష్మారెడ్డి ఇక్కడి గణేశ్ ఉత్సవ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. కాగా, ప్రస్తుతం లడ్డూను కొనుగోలు చేసిన మేరకు ఆ డబ్బును వచ్చే ఏడాది ఇదే రోజున చెల్లిస్తానంటూ ఆయన అందరి సమక్షంలో బాండ్ పేపర్ పై సంతకం చేశారు.
బాలాపూర్ లడ్డూ కోసం ఆరుగురు స్థానికులు, ముగ్గురు స్థానికేతరుల పోటీ!
హైదరాబాద్ గణేశ్ ఉత్సవాల చరిత్రలో బాలాపూర్ వినాయకుడికి ప్రత్యేక స్థానం ఉంది. పరిమాణంలో ఖైరతాబాద్ గణపతి అందరికంటే మిన్న అనిపించుకుంటే, బాలాపూర్ లో గణేశుడి లడ్డూ వేలం పాటకు అదేస్థాయి విశిష్టత ఉంది. బాలాపూర్ లడ్డూకు రికార్డు స్థాయిలో ధర పలుకుతుంది.
1994 నుంచి బాలాపూర్ లడ్డూ వేలం కొనసాగుతోంది. మొదట్లో ఇక్కడి లడ్డూ కేవలం రూ.450 ధర పలికింది. ఆ తర్వాత లక్షలకు చేరింది. గత 28 ఏళ్లలో 2021లో రికార్డు స్థాయిలో లడ్డూ వేలం పాట సాగింది. గతేడాది బాలాపూర్ లడ్డూకు వేలంలో రూ.18.90 లక్షల ధర పలికింది. ఈసారి రూ.24.60 లక్షల ధర .. ఈసారి 9 మంది వేలంలో పాల్గొన్నారు. వారిలో ఆరుగురు స్థానికులు కాగా, ముగ్గురు స్థానికేతరులు.