ఎవడ్రా నీకు మరదలు … వ్యవసాయ శాఖ మంత్రిపై షర్మిల ఘాటు విమర్శలు…
-అదే రీతిలో బదులిచ్చిన మంత్రి నిరంజన్ రెడ్డి
-వైయస్సార్ బిడ్డవైతే మునుగోడులో పోటీచేసి సత్తాచాటు
-గతంలో షర్మిలను ‘మంగళవారం మరదలు’ అన్న నిరంజన్ రెడ్డి
-పాదయాత్రలో నిరంజన్ రెడ్డి నియోజకవర్గంలో అడుగుపెట్టిన షర్మిల
-పరాయి స్త్రీలో తల్లి, చెల్లిని చూడలేని సంస్కారహీనుడని మంత్రిపై వ్యాఖ్య
-తన పోరాటంలో నీకు మరదలు కనిపించిందా? అని నిలదీత
-నీ తండ్రి ఆదాయపు పన్ను కట్టకముందే నేను కట్టానన్న మంత్రి
-తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడే నా బిడ్డలను విదేశాల్లో చదివించానని వెల్లడి
-రక్తపు కూడు తిని పెరిగిన చరిత్ర మీదని విమర్శ
మంత్రి నిరంజన్ రెడ్డి పై షర్మిల విమర్శలు
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిపై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర చేస్తున్న షర్మిల… శుక్రవారం నిరంజన్ రెడ్డి సొంత నియోజకవర్గం వనపర్తిలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా గతంలో తనపై నిరంజన్ రెడ్డి చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను గుర్తు చేసుకున్న షర్మిల… ఆయనపై ఘాటు విమర్శలు గుప్పించారు.
తనను మంగళవారం మరదలు అన్న వ్యాఖ్యలను గుర్తు చేసిన షర్మిల… పరాయి స్త్రీలో తల్లిని, చెల్లిని చూడలేని సంస్కార హీనుడు నిరంజన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. నిరంజన్ రెడ్డికి, కుక్కకు తేడా ఏమైనా ఉందా? అని కూడా ఆమె మరింత ఘాటు వ్యాఖ్య చేశారు. తమ పోరాటంలో నీకు మరదలు కనిపించిందా? అని కూడా ఆమె మంత్రిని నిలదీశారు. అసలు ఎవడ్రా నువ్వు? అంటూ మరింత సంచలన వ్యాఖ్య చేసిన షర్మిల… నీకు సిగ్గు ఉండాలి అంటూ ధ్వజమెత్తారు. అధికార మదం తలకెక్కి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా? అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదే స్థాయిలో షర్మిల పై విరుచుకుపడిన మంత్రి నిరంజన్ రెడ్డి …
ఈ నేపథ్యంలో షర్మిలపై నిరంజన్ రెడ్డి అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. అహంకారంతో వ్యక్తిగతంగా దూషిస్తే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. ఒక్క మాటకు వంద మాటలు అంటామని హెచ్చరించారు.
నీవు రాజన్న బిడ్డవైతే మునుగోడులో పోటీ చేసి నీ సత్తా ఏంటో చూపించాలని సవాల్ విసిరారు. నీ తండ్రి వైఎస్ ఆదాయపు పన్ను కట్టకముందే న్యాయవాదిగా పన్ను కట్టిన వాడినని నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడే తన బిడ్డలను విదేశాల్లో చదివించానని చెప్పారు. వనపర్తి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు తెచ్చి ప్రతి ఎకరాకు నీరు పారించిన చరిత్ర తనదని అన్నారు. 22 ఏళ్లుగా తెలంగాణ జెండా పట్టుకుని ప్రజల ఆకాంక్ష కోసం కొట్లాడిన ఉద్యమకారుడిని తానని చెప్పారు. రక్తపు కూడు తిని పెరిగిన చరిత్ర మీది అని మండిపడ్డారు.