Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

ఐటీ సోదాలపై ఉద్యోగులకు బీబీసీ తాజా లేఖ!

బీబీసీ కార్యాలయాల్లో ఐటీ అధికారుల అన్వేషణ దేని కోసం?

  • పన్నుల ఎగవేత కోణాన్ని వెలికితీసే ప్రయత్నం
  • షెల్ కంపెనీ, ఫండ్ ట్రాన్స్ ఫర్ పదాలతో సమాచార శోధన
  • స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ ఎక్విప్ మెంట్ క్షుణ్ణంగా పరిశీలన

బీబీసీ కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు మంగళవారం ఉదయం నుంచి చేస్తున్న సర్వే కొనసాగుతోంది. ఢిల్లీ, ముంబైలలోని కార్యాలయాల్లో ఏక కాలంలో నిన్న ఉదయం 11 గంటల నుంచి ఈ సర్వే జరుగుతోంది. ఇందులో భాగంగా కార్యాలయాల్లోని అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఎక్విప్ మెంట్, డేటాను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగులకు సంబంధించిన మొబైల్ ఫోన్లను సైతం స్వాధీనం చేసుకున్నారు. 

ఇప్పుడు స్వాధీనం చేసుకున్న పరికరాల నుంచి కీలక సమాచారాన్ని రాబట్టే పనిలో అధికారులు ఉన్నారు. అంతర్జాతీయ పన్ను, బీబీసీ సబ్సిడరీల బదిలీ ధరపై అధికారులు దృష్టి పెట్టారు. ముఖ్యంగా షెల్ కంపెనీ, ఫండ్ ట్రాన్స్ ఫర్, ఫారీన్ ట్రాన్స్ ఫర్ అనే కీవర్డ్స్ తో వారు తమ వద్దనున్న పరికరాల నుంచి డేటాను పొందే పనిలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పన్నుల ఎగవేత కోణాన్ని వెలికితీసే ప్రయత్నంలో అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది.

ఆదాయపన్ను శాఖ గతంలోనూ బీబీసీకి నోటీసులు జారీ చేసింది. నిబంధనలకు వ్యతిరేకంగా తన లాభాలను బీబీసీ గణనీయంగా విదేశాలకు మళ్లించినట్టు ఐటీ శాఖ అనుమానిస్తోంది. వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు.  ఇది సర్వే మాత్రమేనని, ఫోన్లను తిరిగి ఉద్యోగులకు ఇచ్చేయనున్నట్టు అధికారులు ప్రకటించారు.

ఐటీ సోదాలపై ఉద్యోగులకు బీబీసీ తాజా లేఖ!

ప్రముఖ మీడియా సంస్థ బీబీసీకి చెందిన ఢిల్లీ, ముంబైలలోని కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నం మొదలైన సోదాలు.. రాత్రి తెల్లవార్లూ జరిగాయని, ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని అధికార వర్గాల సమాచారం.

ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉద్యోగులకు మెయిల్ పంపిన బీబీసీ.. తాజాగా మరో లేఖను పంపింది. అవసరమైన వారు.. అంటే బ్రాడ్ కాస్ట్ డిపార్ట్ మెంట్ లో పనిచేసే వారు మినహా మిగతా వారు ఆఫీసుకు రానక్కర్లేదని చెప్పింది. ఇంటి వద్ద నుంచే పనిచేయాలని మెయిల్ లో సూచించింది.

ఐటీ అధికారుల సోదాలకు సహకరించాలని మరోమారు సూచించింది. జీతానికి సంబంధించిన వివరాలను అడిగితే చెప్పాలని పేర్కొంది. అయితే, వ్యక్తిగత ఆదాయ వివరాలు అడిగినా చెప్పాల్సిన అవసరంలేదని సూచించినట్లు తెలుస్తోంది. కాగా, పన్ను ఎగవేతకు పాల్పడిందనే అనుమానంతోనే బీబీసీ ఆఫీసుల్లో సర్వే చేస్తున్నట్లు ఐటీ అధికారులు మంగళవారం వెల్లడించారు.

పలు అంశాలకు సంబంధించి సంస్థ లెక్కల్లో చూపించిన ఖర్చులపై సందేహాలు ఉన్నాయని అన్నారు. వాటిని నివృత్తి చేసుకోవడానికి బీబీసీ అకౌంట్స్ బుక్స్ ను, బ్యాలెన్స్ షీట్ తదితర అకౌంట్స్ వెరిఫికేషన్ చేస్తున్నట్లు తెలిపారు. ఇవి సోదాలు కాదని, సర్వే మాత్రమేనని ఐటీ వర్గాలు స్పష్టం చేశాయి.

బీబీసీ కార్యాలయాల్లో  సోదాలపై తమకు సమాచారం …అమెరికా

భారతదేశంలోని బీబీసీ కార్యాలయాల్లో జరుగుతున్న ఐటీ సోదాలపై అమెరికా స్పందించింది. ఢిల్లీ, ముంబైలలో జరుగుతున్న సోదాలపై తమకు సమాచారం ఉందని పేర్కొంది. అయితే, తాము ఎలాంటి నిర్ణయం తీసుకునే స్థితిలో లేమని అమెరికా విదేశాంగ ప్రతినిధి నెడ్ ప్రైస్ పేర్కొన్నారు. పత్రికా స్వేచ్ఛ ప్రాముఖ్యత తమకు తెలుసని, ప్రపంచవ్యాప్తంగా దానికి తమ మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు.

ఈమేరకు మీడియా సమావేశంలో నెడ్ మాట్లాడుతూ.. బీబీసీ ఆఫీసులలో భారత ఐటీ అధికారులు జరుపుతున్న సోదాల విషయం తమకు తెలుసని అన్నారు. ఈ సోదాలకు సంబంధించిన నిజాలు కూడా తనకు తెలుసని చెప్పారు. అయితే, ఈ విషయంపై మాట్లాడే స్థితిలో తాను లేనని వివరించారు. సోదాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇండియన్ అధికారులనే సంప్రదించాలని అమెరికా మీడియాకు నెడ్ సూచించారు.

ప్రపంచవ్యాప్తంగా భావప్రకటన స్వేచ్ఛ, మత స్వేచ్ఛలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని పటిష్ఠం చేయడానికి భావప్రకటన స్వేచ్ఛ తోడ్పడుతుందని వ్యాఖ్యానించారు. అమెరికాతో పాటు ఇండియాలో ప్రజాస్వామ్యాన్ని బలంగా తీర్చిదిద్దింది భావప్రకటన స్వేచ్ఛేనని నెడ్ పేర్కొన్నారు.

మరోవైపు, బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయో ఆదాయపన్ను శాఖ ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తుందని, సర్వే పూర్తయ్యాక వివరాలను బయటకు వెల్లడిస్తుందని మంత్రి చెప్పారు. బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సర్వే పూర్తయిన తర్వాత పూర్తి వివరాలను మీడియాకు వెల్లడిస్తామని మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.

Related posts

నాలుగు దశాబ్దాల్లో తొలిసారి.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గేదే ఆ ఘనత!

Drukpadam

నేను ప్రజలు ఎన్నుకున్న సీఎంని.. నీవెవరు?: కేజ్రీవాల్ ఫైర్

Drukpadam

ప్లీజ్.. గొడవ పడడం ఆపండి: మైతేయిలు, కుకీలకు మణిపూర్ ముస్లింల విజ్ఞప్తి

Ram Narayana

Leave a Comment