తెలంగాణ లో సిపిఐ గుర్తు కంకి కొడవలి కొనసాగుతుంది…కూనంనేని…
-ఎన్నికల సంఘం నుంచి సిపిఐ స్టేట్ కౌన్సిల్ కు అందిన ఉత్తర్వులు
-కేరళ ,మణిపూర్ , తమిళనాడు లలో కూడా సిపిఐకి కంకి కొడవలి గుర్తు
-2018 ఎన్నికల సంఘం నియమ నిబంధనలు , పార్టీ నిర్మాణం పరిగణలోకి
-సిపిఐకి తిరిగి జాతీయ స్థాయి హోదా పొందే అవకాశం …
-పార్టీ నిర్మాణానికి , పురోగతికి కార్యకర్తలు కృషి చేయాలి …
అనేక ఉద్యమాలు , ప్రజల పక్షాన పోరాటాలు నిర్వహిస్తూ , నిర్మాణంలో ,నియమ ,నిబంధనల్లో సిపిఐ వ్యవహరిస్తున్న తీరు , రాష్ట్రంలో పార్టీకి ఉన్న చరిత్ర ఆధారంగా, ఆపార్టీకి జాతీయ హోదా రద్దు చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో పార్టీ గుర్తు ను కొనసాగించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. తమ పార్టీ ఎన్నికల గుర్తు కంకి కొడవలి కొనసాగించేందుకు ఎన్నికల సంఘం అంగీకరించిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు . ఈమేరకు రాష్ట్రంలో భారత కమ్యూనిస్టు పార్టీకి రాష్ట్ర స్థాయి గుర్తింపును కొనసాగిస్తున్నట్లుగా తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమీషన్ ఒక నోటిఫికేషన్ ద్వారా పార్టీ స్టేట్ కౌన్సిల్కి తెలియజేయడం జరిగిందన్నారు .
భారత దేశంలో కేరళ, మణిపూర్, తమిళనాడు రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కూడా రాష్ట్ర గుర్తింపును కొనసాగిస్తున్నట్లుగా ఆ నోటిఫికేషన్లో తెలియజేయడం పేర్కొన్నారు . 2018 ఎన్నికల గుర్తులకు సంబంధించినటువంటి నియమనిబంధనల ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీకి ఉన్నటువంటి నిర్మాణం, ఇతర అంశాలను పరిగణనలోనికి తీసుకొని రాష్ట్రస్థాయి గుర్తింపును కొనసాగిస్తున్నట్ల ఎన్నికల సంఘం పేర్కొన్నది . స్థానిక సంస్థలతోపాటు, రాష్ట్రంలో పార్టీల వారీగా జరిగే అన్ని ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ గుర్తు ‘‘కంకికొడవలి’’ యదాతధంగా కొనసాగుతుంది . ఎన్నికల సంఘం తన నోటిఫికేషన్ ద్వారా తమకు సమాచారం ఇచ్చారని కూనంనేని తెలియజేశారు.
జాతీయ స్థాయి హోదాను కూడా త్వరలోనే తిరిగి పొందగలిగే అవశాకాశాలు ఉన్నందున కమ్యూనిస్టు పార్టీ అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు, కమ్యూనిస్టు పార్టీని ఆదరిస్తున్నటువంటి ఓటర్లు అందరూ మరింత విశ్వాసంతో పార్టీని నిర్మించుకుంటూ, పార్టీని పురోగమనం వైపు తీసుకెళ్లడంలో మరింత పట్టుదలతో కృషి చేయగలరని ఆయన తెలియజేశారు.