- ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు
- తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఘటన
- గాయపడిన 8 మంది పరిస్థితి కూడా విషమం
మహారాష్ట్రలో ఓ బస్సులో మంటలు చెలరేగి 25 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో ఎనిమిదిమంది తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. 32 మంది ప్రయాణికులతో యావత్మాల్ నుంచి పూణె వెళ్తున్న బస్సు బుల్దానాలోని సమృద్ధి మహామార్గ్ ఎక్స్ప్రెస్ వేపై వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఈ తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో జరిగిందీ ఘటన. మంటల ధాటికి బస్సు పూర్తిగా కాలిబూడిదైంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను బుల్దానా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మహారాష్ట్ర బస్సు ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
మహారాష్ట్రలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. సమృద్ధి-మహామార్గ్ ఎక్స్ప్రెస్వేపై ఇవాళ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 మంది సజీవదహనమైన విషయం తెలిసిందే. బస్సు టైరు పేలడం వల్ల ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉందని పోలీసులు వెల్లడించారు. బోల్తా కొట్టిన బస్సు డీజిల్ ట్యాంక్ లీకైందని, దాని వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రయాణికులు నిద్రలో ఉన్న కారణంగా 25 మంది సజీవ దహనం అయ్యారు.