- రాహుల్పై విధించిన జైలు శిక్ష అమలుపై సుప్రీం స్టే
- తిరిగి ఎంపీగా రాహుల్ కొనసాగేందుకు అవకాశం
- అనర్హతను ఎత్తివేస్తున్నట్లు లోక్సభ సచివాలయం నోటిఫికేషన్ ఇస్తేనే!
‘మోదీ ఇంటి పేరు’పై వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్ష అమలుపై ధర్మాసనం స్టే ఇచ్చింది. దీంతో రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వాన్ని తిరిగి పునరుద్ధరిస్తారా? ప్రస్తుత లోక్సభ సమావేశాలకు హాజరయ్యేందుకు ఆయనకు అవకాశం ఉందా? వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయొచ్చా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
రాహుల్కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత.. లోక్సభ సచివాలయం ఆయనపై ఎంపీగా అనర్హత వేటు వేసింది. చట్టం ప్రకారం.. రెండేళ్లు లేదా అంతకన్నా ఎక్కువ రోజులు జైలు శిక్ష పడిన వ్యక్తి రాజ్యాంగ పదవికి అనర్హులవుతారు. శిక్షాకాలంతోపాటు మరో ఆరేళ్లు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉండదు.
ఇప్పుడు శిక్ష అమలుపై సుప్రీం స్టే ఇవ్వడంతో.. రాహుల్ గాంధీ తిరిగి ఎంపీగా కొనసాగే అవకాశం ఉంది. అయితే సుప్రీం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు లోక్సభ సచివాలయం వెల్లడించాల్సి ఉంటుంది. అదే సమయంలో రాహుల్పై విధించిన అనర్హత వేటును ఎత్తివేస్తున్నట్లు మళ్లీ నోటిఫికేషన్ను జారీ చేయాల్సి ఉంటుంది.
మరోవైపు సుప్రీంకోర్టులో విచారణ పూర్తయి రాహుల్ నిర్దోషి అని కోర్టు ప్రకటిస్తే.. లేదా రాహుల్ శిక్షా కాలాన్ని 2 ఏళ్ల కంటే తక్కువ చేస్తే.. వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీ చేసేందుకు వీలుంటుంది. ఆగస్టు 11 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో లోక్సభ సచివాలయం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరం.
ద్వేషంపై ప్రేమ సాధించిన విజయం.. సత్యమేవ జయతే: కాంగ్రెస్
![Congress On Court Order In Rahul Gandhi Defamation Case](https://i0.wp.com/img.ap7am.com/bimg/cr-20230804tn64cccb0e1fa90.jpg?w=1400&ssl=1)
మోదీ ఇంటిపేరు కేసులో శిక్ష పడిన రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో శుక్రవారం భారీ ఊరట దక్కింది. రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పుపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఈ తీర్పు ద్వేషంపై ప్రేమ సాధించిన విజయం… సత్యమేవ జయతే – జైహింద్ అని ట్వీట్ (ఎక్స్) చేసింది.
సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ అగ్రనేత పి చిదంబరం స్పందించారు. గౌరవనీయులైన లోక్ సభ స్పీకర్ వెంటనే రాహుల్ లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని కోరారు. గత 162 ఏళ్లలో ఇలాంటి కేసుకు రెండేళ్ల శిక్ష విధించిన కోర్టు కేసును తాము కనుగొనలేకపోతున్నామన్నారు. రాహుల్ గాంధీని పార్లమెంట్కు రాకుండా చేయాలనే ఏకైక ఉద్ధేశ్యంతో ఈ కేసును సిద్ధం చేశారని భావిస్తున్నామన్నారు. న్యాయం గెలిచింది.. ప్రజాస్వామ్య సభల్లో మళ్లీ సత్య గర్జన వినిపిస్తుంది అని రణ్దీప్ సుర్జేవాలా ట్వీట్ చేశారు.