- న్యూయార్క్ టైమ్స్ పత్రిక సంచలన కథనం
- అమెరికా అందించిన సమాచారానికి కెనడా మరింత సమకూర్చుకున్నట్లు కథనం
- సేకరించిన ఆధారాల విడుదలకు సిద్ధంగా లేని కెనడా!
ఖలిస్థాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి కీలక ఇంటెలిజెన్స్ సమాచారం అమెరికా నుంచే కెనడాకు అందినట్లుగా న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనం వెలువరించింది. అగ్రరాజ్యం అందించిన సమాచారానికి కెనడా మరింత సమకూర్చుకున్నట్లుగా ఈ కథనంలో తెలిపింది. భారత దౌత్యవేత్త కమ్యూనికేషన్లలోకి చొరబడి సేకరించిన సమాచారం కెనడాకు ఆధారంగా మారిందని, ఈ క్రమంలోనే దర్యాఫ్తుకు భారత్ సహకరించాలని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి సూచించారని అందులో పేర్కొన్నారు.
కెనడా, అమెరికాలు పరస్పరం ఇంటెలిజెన్స్ను పంచుకొంటాయి. ఇందులో భాగంగా ఉద్దేశ్యపూర్వకంగా నిజ్జర్ హత్యకు సంబంధించిన ఇంటెజిలెన్స్ సమాచారాన్ని కూడా అమెరికా జొప్పించి కెనడాకు అందించిందని తెలిపింది. అయితే ఈ అంశంపై వైట్ హౌస్ స్పందించాల్సి ఉంది. మరోవైపు, తాము సేకరించిన సమాచారాన్ని విడుదల చేసేందుకు కెనడా కూడా సిద్ధంగా లేదు.
కెనడా హిందువులు భయపడుతున్నారు: సొంత ప్రభుత్వంపై ప్రధాని ట్రూడో పార్టీకి చెందిన ఎంపీ

- హిందూ సమాజం అప్రమత్తంగా ఉండాలన్న ఎంపీ చంద్ర ఆర్య
- ఖలిస్థాన్ హింస, ఇందిరా గాంధీ హత్య, గుర్పత్వంత్ సింగ్ హెచ్చరికలు
- ఈ మూడింటిని ఉదహరించిన ట్రూడో సొంత పార్టీ ఎంపీ
కెనడాలో ఖలిస్థాన్ వేర్పాటువాదులపట్ల ప్రభుత్వం చర్యలు నిష్క్రియాత్మకంగా ఉండటం, అదే సమయంలో ఉగ్రవాద మూకల బెదిరింపుల వల్ల కెనడా హిందువులు భయానికి గురవుతున్నారని అధికార లిబరల్ పార్టీ ఎంపీ చంద్ర ఆర్య ఆందోళన వ్యక్తం చేశారు. చంద్ర ఆర్య… కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో లిబరల్ పార్టీకి చెందిన ఎంపీ కావడం గమనార్హం. హిందూ కెనడియన్లు పదేపదే హెచ్చరికలు ఎదుర్కొంటున్నారన్నారు. హిందూ సమాజం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల సమయంలో కెనడాలోని హిందువులు భారత్కు తిరిగి వెళ్లాలని గుర్పత్వంత్ సింగ్ పన్నుతో పాటు పలువురు వేర్పాటువాద తీవ్రవాదులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఎంపీ చంద్ర ఆర్య ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆయన సీబీసీ న్యూస్తో మాట్లాడుతూ… ప్రధాని (ట్రూడో) ప్రకటన తర్వాత ఏం జరుగుతుందోనని కెనడాలోని హిందువుల భయపడుతున్నారన్నారు. ఈ సందర్భంగా ఆయన మూడు కారణాలను చెప్పారు. ఖలిస్థాన్ హింస, చరిత్ర అంతా రక్తపాతమేనని, వీరి కారణంగా పదివేల మంది హిందువులు, సిక్కులు మరణించారన్నారు. 38 ఏళ్ల క్రితం కెనడా నుంచి ఇండియా వెళ్తున్న ఎయిరిండియా విమానంపై బాంబు దాడి, 9/11కు ముందు జరిగిన అతిపెద్ద విమానయాన ఉగ్రదాడి అని తెలిపారు. కెనడాలోని కొన్ని ప్రాంతాల్లో ఎయిరిండియా దాడి చేసిన ఉగ్రవాదులను ఆరాదించడం వాస్తవమే అన్నారు.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీని హత్య చేసిన విధానాన్ని కెనడాలో ఓ ర్యాలీలో శకటంపై ప్రదర్శించారని, ఇది ఖండించదగ్గ అంశమన్నారు. ప్రధానిగా ఉన్న వ్యక్తి హత్యను, అందుకు సంబరాలు చేసుకోవడాన్ని ఏ దేశం అనుమతిస్తుందో చెప్పాలన్నారు. మరో విషయం ఏమంటే గుర్పత్వంత్ సింగ్ వంటి వారు హిందూ కెనడియన్లను కెనడా వదిలి వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి చాలామంది సిక్కులు, కెనడియన్లు ఖలిస్థాన్ ఉద్యమానికి మద్దతివ్వడం లేదన్నారు.