తెలంగాణలో అక్టోబర్ 7 -10 తేదీల మధ్యలో ఎన్నికల షెడ్యూల్?
అక్టోబర్ 3 నుంచి 6 వరకు కమిషన్ సభ్యుల రాష్ట్ర పర్యటన
ఆ తర్వాత ఏ క్షణంలోనైనా ప్రకటన విడుదలయ్యే అవకాశం
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు ఈసీ కసరత్తు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే నెల 10 లోపు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి కమిషన్ సభ్యులు తెలంగాణలో పర్యటించనున్నారు. కమిషన్ సభ్యులు ముగ్గురు అక్టోబర్ 3 నుంచి 6 వరకు రాష్ట్రంలో పర్యటిస్తారని, ఆ తర్వాత ఏ క్షణమైనా షెడ్యూల్ విడుదలవుతుందని ఈసీ అధికారి ఒకరు వెల్లడించారు. గత అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా అక్టోబర్ 7న విడుదలైందని గుర్తుచేశారు.
అసెంబ్లీ ఎన్నికల సంసిద్ధతపై ఈసీ బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, కలెక్టర్లు, పోలీసులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కానుంది. రాష్ట్ర పర్యటన పూర్తయ్యాక ఢిల్లీలో ఉన్నతాధికారులతో భేటీ నిర్వహించి ఎన్నికల షెడ్యూల్ విడుదలపై నిర్ణయం తీసుకుంటారని అధికార వర్గాల సమాచారం. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మిజోరం అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు చేస్తారు.
ఇప్పటికే బీఆర్ యస్ తన అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో ముందుంది. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో తలమునకలైంది .బీజేపీ పోటీచేసే అభ్యర్థుల జాబితా సిద్ధం చేస్తుంది .ప్రచాని నరేంద్ర మోడీ .సోనియా , రాహుల్ , ప్రియాంక , ఖర్గే , అమిత్ షా , కేసీఆర్ , కేటీఆర్ హరీష్ రావులు పర్యటనలతో ఎన్నికల వాతావరణం వచ్చింది. డిసెంబర్ మొదటివారంలో ఎన్నికలు జరగనున్నాయి…