తెలంగాణ లో లాక్డౌన్ మరో 10 రోజుల పొడిగింపు …
-కొన్ని మినహాయింపులు 3 గంటలు అదనంగా సడలింపు
-ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు
తెలంగాణలో లాక్డౌన్ మరో 10 రోజులు పొడిగిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రంలో నేటితో లాక్డౌన్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో సమావేశమైన కేబినెట్.. మళ్లీ జూన్ 10 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే సడలింపు సమయాన్నిమూడు గంటలు పెంచింది. ఇప్పటి వరకు ఉదయం 6 నుంచి 10 గంటల వరకే సడలింపు ఇస్తుండగా.. దాన్ని మధ్యాహ్నం 1 గంట వరకు పొడిగించారు. కర్ఫ్యూ సమయంలో కఠినముగా వ్యవహరించాలని నిర్ణయించారు . గతంలో తీసుకున్న కర్ఫ్యూ వలన కరోనా కట్టడి చేయగలిగామని అందువల్ల మరో 10 రోజులు లాక్ డౌన్ పొడిగించటమే మంచిదని మంత్రులు అందరు అభిప్రాయపడ్డారు . దీంతో కేసీఆర్ తనకు వచ్చిన ఫీడ్ బ్యాక్ ను కూడా మంత్రులకు వివరించారు. హైద్రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసి లాక్ డౌన్ పెట్టవద్దనే విజ్నప్తి ని కూడా మంత్రి వర్గంలో చర్చించారు. దీనిపై కూడా ఆలోచన చేసినప్పటికీ లాక్ డౌన్ వల్ల కరోనా బాగా కట్టడి చేయగలిగామని అందువల్ల మరో 10 రోజులు పొడిగిస్తే మరిన్ని ఫలితాలు ఉంటాయని కాబినెట్ అభిప్రాయపడింది .
లాక్ డౌన్ పొడిగింపు నేపధ్యంలో.. కొవిడ్, సడలింపు నిబంధనలను అనుసరించి., ప్రభుత్వ పనిదినాల్లో, స్టాంప్స్ అండ్ రిజిష్ట్రేషన్ల శాఖ ఆధ్వర్యంలో జరిగే భూములు, ఆస్తుల రిజిష్ట్రేషన్లతో పాటు, రవాణాశాఖ ఆధ్వర్యంలో జరిగే వాహనాల రిజిస్ట్రేషన్ కార్యకలాపాలకు అనుమతించాలని కేబినెట్ నిర్ణయించింది.