నామ గెలిస్తేనే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు …హరీష్ రావు
గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టాలి
రుణ మాఫీ పై రేవంత్ మాట నిలబెట్టుకోవాలి
క్షేత్ర స్థాయి లోనే అంతా పని చేయాలి : నామ నాగేశ్వరరావు
ఖమ్మం లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పాల్గొని ప్రసంగించారు ..
నామ గెలిస్తేనే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఆమలవుతాయి.. గడప గడపకు వెళ్ళండి… ప్రతి తలుపు తట్టి కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టి , నామ నాగేశ్వరరావు విజయానికి నడుం బిగించాలని బీఆర్ ఎస్ పార్టీ వ్యవస్థాపక నాయకులు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఖమ్మం సీక్వెల్ క్లబ్ లో బుధవారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. నామను మంచి మెజార్టీతో గెలిపించి, కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలని హరీష్ రావు అన్నారు.ప్రజా పాలనను గాలికి వదిలి , ప్రతీకార చర్యలకు పాల్పడుతున్న కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలన్నారు. నామకు ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తే ఆ పార్టీకి కనువిప్పు కలుగుతుందన్నారు. ఆగస్టు 15 లోపు రుణ మాఫీ చేయకపోతే సీఎం రేవంత్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాటపై ఈ నెల 26న అమరవీరుల స్తూపం వద్ద ప్రమాణానికి తాను సిద్దమని, రేవంత్ కూడా అందుకు సిద్ధమా అని సవాల్ చేశారు. కాంగ్రెస్ పరిస్థితి పనికి ముందు ఓడ మల్లప్ప పని అయిన తర్వాత బోడ మల్లప్ప అన్న విధంగా ఉందన్నారు. కాంగ్రెస్ వి తుపాకీ రాముడి మాటలన్న సంగతిని ప్రజలు గ్రహించారని అన్నారు. అందుకే గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలని అన్నారు. ఎవరెన్ని చేసినా నామ నాగేశ్వరరావు గెలుపును ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు.
ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్షేత్ర స్థాయిలో పని చేయాలని అన్నారు. నేనే నామ అనుకుని పని చేయాలన్నారు. తెలంగాణా వాణి పార్లమెంట్ లో వినిపించే సత్తా ఒక్క బీఆర్ఎస్ ఎంపీలకే సాధ్యమన్నారు.అందుకే తనను గెలిపించి, కేసీఆర్ కు మద్దతుగా నిలవాలని అన్నారు…
మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, జెట్పీ చైర్మన్ లింగాల కమలరాజు, మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, సండ్ర వెంకట వీరయ్య, .మెచ్చా నాగేశ్వరరావు,తాటి వెంకటేశ్వర్లు, మదన్ లాల్,మేయర్ నీరజ, బచ్చు విజయకుమార్, దుర్గ, బొమ్మెర రామ్మూర్తి, ఆర్జేసీ కృష్ణ, కర్నాటి కృష్ణ, నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.