- నల్గొండ జిల్లాలో అమానవీయ ఘటన
- పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన యువకుడు
- కోర్టులో విచారణ జరుగుతుండగా పెద్ద మనుషులతో రాజీ యత్నం
ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఓ మైనర్ ను గర్భవతిని చేశాడో యువకుడు.. తీరా వేరే అమ్మాయిని పెళ్లిచేసుకోవడంతో ఆ బాలిక పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. బాలికను మోసం చేసినట్లు నిర్ధారించే సాక్ష్యాలు బలంగా ఉండడంతో శిక్ష తప్పదని భావించిన యువకుడు కొత్త ఎత్తు వేశాడు. పెద్దమనుషులను రంగంలోకి దించి రూ.5 లక్షలతో కేసు నుంచి బయటపడే ప్రయత్నంచేశాడు.
నల్గొండ జిల్లాలో జరిగిన ఈ అమానవీయ ఘటన వివరాలు.. జిల్లాలోని ఎరసానిగూడెం గ్రామానికి చెందిన ఓ బాలికను ఆరేళ్ల క్రితం చిప్పలపల్లి గ్రామానికి చెందిన వెంకన్న అనే యువకుడు ప్రేమించానని, పెళ్లిచేసుకుంటానని చెప్పి నమ్మించాడు. మాయమాటలతో మభ్యపెట్టి శారీరకంగా వాడుకున్నాడు. దీంతో బాలిక గర్భం దాల్చగా.. వెంకన్న మాత్రం వేరే పెళ్లి చేసుకున్నాడు.
దీంతో పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ వెంకన్నపై బాలిక కట్టంగూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు సదరు యువకుడిపై కేసు నమోదు చేసి వెంకన్నను కోర్టులో హాజరుపరిచారు. డీఎన్ఏ పరీక్షల్లోనూ బాలిక గర్భానికి కారణం వెంకన్నేనని తేలింది. దీంతో ఈ కేసులో శిక్ష తప్పదని భావించిన వెంకన్న పెద్దమనుషులతో రాజీకి ప్రయత్నించాడు. పెద్ద మనుషులు బాలిక శీలానికి ఖరీదు కడుతూ.. రూ.5 లక్షలు ఇవ్వాలని తీర్మానించారు. ఇందులో రూ.3.50 లక్షలు పెద్ద మనుషుల పేరుమీద బ్యాంకులో జమ చేసి, మిగతా రూ.1.50 లక్షలు కేసు ముగిసిన వెంటనే ఇచ్చేలా వెంకన్న డీల్ కుదుర్చుకున్నట్లు తెలిసింది.