- తెలంగాణకు ఇచ్చింది గుండుసున్నా అని విమర్శ
- తెలుగింటి కోడలు అయి ఉంటే తెలంగాణపై అభిమానం చూపలేదని ఆగ్రహం
- రాజకీయ లబ్ధి కోసం బీహార్కు భారీ కేటాయింపులని ఆరోపణ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని, రాజకీయంగా రాష్ట్రాన్ని దెబ్బతీయాలని చూస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కేంద్ర బడ్జెట్పై ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు కేటాయించింది శూన్యమన్నారు. తెలుగు కోడలు అయి ఉండి కూడా నిర్మలా సీతారామన్ తెలంగాణపై అభిమానం చూపించలేకపోయారని విమర్శించారు.
త్వరలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున ఆ రాష్ట్రంలో రాజకీయ లబ్ధి కోసం భారీగా కేటాయింపులు చేశారని ఆరోపించారు. తెలంగాణ ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇతర బీజేపీ నేతలు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు కేంద్రమంత్రులను, ప్రధానమంత్రిని కలిసి తెలంగాణకు రావాల్సిన అనేక అంశాలపై విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆయన అన్నారు. తెలంగాణకు అవసరమైన అంశాల్లో కేంద్రం సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.