- అమెరికాకు మరో సవాల్ విసురుతున్న చైనా
- పెంటగాన్ కన్నా పది రెట్ల సామర్థ్యంతో చైనా సైనిక స్థావరం నిర్మాణం!
- అగ్రరాజ్య హోదా కోసం వడివడిగా అడుగులు వేస్తున్న చైనా
అగ్రరాజ్యమైన అమెరికాకు చైనా అన్ని రంగాల్లోనూ సవాల్ విసురుతోంది. ఆర్థిక, సైనిక, సాంకేతిక వ్యవస్థల్లో అమెరికాకు పోటీగా ఎదగాలని చైనా భావిస్తోంది. ఈ క్రమంలో చైనా తన కార్యాచరణను వేగవంతం చేసింది. అగ్రరాజ్య హోదా కోసం ప్రణాళికలను రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల చైనా ఏఐ చాట్ బాట్ ‘డీప్ సీక్’ పెద్ద సంచలనాన్ని రేపింది. కృత్రిమ మేధ (ఏఐ)లో అగ్రగామిగా ఉన్న అమెరికాకు చైనా సవాల్ విసిరింది.
మరోవైపు అమెరికా మిలటరీ కేంద్రం పెంటగాన్కు పది రెట్లు పెద్దదైన భారీ మిలిటరీ కేంద్రాన్ని నిర్మించేందుకు చైనా సిద్ధమైంది. ఈ విషయాన్ని యూఎస్ ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొన్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ ఒక నివేదికలో వెల్లడించింది. బీజింగ్ మిలిటరీ సిటీ పేరుతో గత ఏడాది ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించింది. రాజధాని నగరానికి నైరుతి దిశలో 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న 1,500 ఎకరాల ప్రాంతంలో నిర్మాణం కోసం తవ్విన పెద్ద పెద్ద గోతులను ఇటీవలి ఉపగ్రహ చిత్రాలతో చూపిస్తోంది.
కొత్తగా చైనా నిర్మిస్తున్న బీజింగ్ మిలిటరీ సిటీలో బంకర్లు ఉండవచ్చని, అణుయుద్ధంతో సహా ఏదైనా సంఘర్షణ సమయంలో కమ్యూనిస్టు పార్టీ చైనా పొలిట్ బ్యూరో అధికారులను రక్షించేందుకు బంకర్లు నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. పెంటగాన్ కన్నా పది రెట్లు పెద్దదైన నిర్మాణంతో జి. జిన్పింగ్ అమెరికాను అధిగమించాలని చూస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు వివరాలను వాషింగ్టన్లోని చైనా రాయబార కార్యాలయం తమకు తెలియదని పేర్కొంటూ రహస్యంగా ఉంచింది.