- మరో రెండ్రోజుల్లో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
- జగన్, ఇతర వైసీపీ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దయ్యే ప్రమాదం
- అసెంబ్లీకి ఒకరోజు వచ్చి వెళ్లిపోయే ఆలోచనలో జగన్, ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 24 నుంచి జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ సమావేశాల తొలి రోజున రాష్ట్ర గవర్నర్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. బీఏసీ సమావేశం అనంతరం, ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయన్న అంశంపై స్పష్టత రానుంది.
కాగా, ఈసారి వైసీపీ అధినేత జగన్ తో పాటు, ఆ పార్టీకి చెందిన ఇతర ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి హాజరవుతారని తెలుస్తోంది. ఎందుకంటే… వరుసగా 60 పనిదినాల పాటు అసెంబ్లీకి హాజరుకాకపోతే, సదరు ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడుతుందని ఇటీవలే ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఓ ప్రెస్ మీట్ లో చెప్పారు. ఆ లెక్కన జగన్ కు అనర్హత ముప్పు పొంచి ఉందని సూచనప్రాయంగా వెల్లడించారు.
ఈ నేపథ్యంలో, శాసనసభ సభ్యత్వాలు రద్దయ్యే ప్రమాదం ఉండడంతో… జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు ఒక రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరై వెళ్లిపోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.