- ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం
- రాష్ట్రవ్యాప్తంగా 175 సెంటర్లలో ఎగ్జామ్స్
- పరీక్ష రాయనున్న 92,250 మంది అభ్యర్థులు
- తిరుపతిలో పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రానికి వచ్చిన నవవధువు
వివాదాలు, గందరగోళ పరిస్థితుల మధ్య ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 175 సెంటర్లలో ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. 92,250 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. దీనికోసం ఏపీపీఎస్సీ ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు చేసింది.
అయితే, ఓ నవవధువు తలపై జీలకర్ర బెల్లంతో పరీక్షలకు హాజరుకావడంతో అందరూ ఆసక్తిగా గమనించారు. తిరుపతిలో పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో ఈ దృశ్యం కనిపించింది. తిరుపతికి చెందిన నమితకు ఈరోజు తెల్లవారుజామున వివాహమైంది. ఉదయాన్నే పరీక్ష ఉండడంతో తలపై జీలకర్ర బెల్లం, పెళ్లి దుస్తులతోనే ఎగ్జామ్ సెంటర్కు వచ్చేసింది. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
కాగా, రోస్టర్ విధానంలో ఉన్న తప్పులను సవరించాలని కోరుతూ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు రాష్ట్రంలోని పలుచోట్ల ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, పరీక్షను వాయిదా వేయమని ఏపీపీఎస్సీని కోరింది.
అయితే, రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున, గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించే నిర్ణయాలు తీసుకోలేమని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. అందుకే ఈ పరీక్షను షెడ్యూల్ ప్రకారమే యథాతథంగా నిర్వహిస్తున్నట్టు తెలిపింది.