సైన్సు అండ్ టెక్నాలజీ

ఆ గ్రహశకలంతో మనకు ముప్పులేదట!

  • భూమిని ఢీ కొట్టే అవకాశం దాదాపు శూన్యమే అంటున్న ఈఎస్ఏ
  • 2024 వైఆర్ 4 గ్రహశకలం కదలికలను పరిశీలించిన స్పేస్ ఏజెన్సీ
  • తొలుత ముప్పు ఎక్కువని చెప్పిన నాసా.. తాజాగా హెచ్చరికలు వాపస్

అంతరిక్షంలో సూర్యుడి చుట్టూ అత్యంత వేగంగా తిరుగుతున్న ఓ గ్రహశకలం 2032లో భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని అంతరిక్ష పరిశోధనా సంస్థ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. 2024 డిసెంబర్ 27న ఈ గ్రహశకలాన్ని చిలీ పరిశోధకులు గుర్తించారు. సూర్యుడి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్న ఈ గ్రహశకలం వేగంగా భూమివైపు దూసుకొస్తోందని తెలిపారు. ఈ నెల 18న నాసా జరిపిన పరిశీలనలో 2024 వైఆర్ 4 గ్రహశకలం భూమిని ఢీ కొట్టేందుకు 3.1 శాతం అవకాశం ఉందని తేలింది. దీంతో ఈ గ్రహశకలాన్ని లెవెల్ -3 శకలంగా నాసా ప్రకటించింది. అయితే, ఈ గ్రహశకలంతో ఎలాంటి ముప్పు లేదని ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ) నిర్ధారించింది. 

ఈ నెల 19న జరిపిన పరిశోధనలో ముప్పు శాతం 1.5 శాతంగా తేలిందని, ఈ నెల 24న జరిపిన పరిశోధనలో ముప్పు శాతం 0.002 శాతానికి తగ్గిందని నాసా కూడా వెల్లడించింది. దీంతో ఈ గ్రహశకలంతో భూమికి ముప్పు లేదని తేల్చి హెచ్చరికలను ఉపసంహరించుకుంది. అయితే, ఈ గ్రహశకలంపై నిఘా కొనసాగిస్తామని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. దీని పరిమాణం, లోపలి మూలకాల వివరాల గురించి పరిశోధన జరుపుతామని చెప్పారు. జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోపుతో ఈ గ్రహశకలాన్ని మార్చి, మే నెలల్లో పరిశీలించనున్నట్లు తెలిపారు. 2024 వైఆర్ 4 వ్యాసం సుమారు 50 మీటర్లు ఉండవచ్చని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కాగా, సూర్యుడి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరగడం వల్ల ఈ గ్రహశకలం కొన్నాళ్లపాటు కనిపించదని, 2028 జూన్ లో మళ్లీ కనిపిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

Related posts

ప్రేమ మెదడును వెలిగిస్తుందంటున్న శాస్త్రవేత్తలు

Ram Narayana

ఆకాశంలో అద్భుతం.. ‘రింగ్ ఆఫ్ ఫైర్’ భారత్‌లో కనిపిస్తుందా?

Ram Narayana

భూమికి 120 కాంతి సంవత్సరాల దూరంలో జీవం

Ram Narayana