సిపిఐ నూరేళ్ళ చరిత్ర ఒక అద్భుత ప్రయాణం
సిపిఐ వంద సంవత్సరాలు ఉద్యమ ప్రస్థానం ఒక అద్భుతం . కష్టాల కడలి తరంగం,ఉద్యమాల చరిత్ర ,త్యాగాల ఘనకీర్తి . ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ,అడ్డంకులు వచ్చినా, మొక్కవోనీదీక్షతో ఎర్రజెండాను కంటికి రెప్పలా కాపాడుకుంటూ మొక్కవోని దీక్షతో పార్టీని నడిపిన నడుపుతున్న కామ్రేడ్స్ కు లాల్ సలాం.

1925లో కాన్పూర్ లో పుట్టిన పార్టీ అంచలంచలుగా ఎదిగి అనేక ఉత్తాన పతనాలు చూసి నిలదొక్కుకోవడం అరుదైన విషయం. ఒక పార్టీ 100 సంవత్సరాలు చరిత్ర సింహవలోకనం చేసుకోవాలంటే త్యాగాల చరిత్ర ఉద్యమాల నేపద్యం మననం చేసుకోవాల్సిందే. వంద సంవత్సరాల కాలంలో పార్టీ అధికారంలో లేదు. కేవలం ప్రజా మద్దతు మాత్రమే దానికి శ్రీరామరక్షగా నిలిచింది. అనేక నిర్బంధాలు ఆటుపోట్లు ఎదుర్కొని కార్మిక కర్షక పేదల పక్షపాతిగా నిలిచింది. అనేక పార్టీలు మగలో పుట్టి పుబలో మాయమైపోతుంటాయి. కానీ ఇది అలా కాదు. స్వాతంత్ర పోరాటంలోను ఆ తర్వాత కార్మికవర్గ హక్కుల కోసం నిలిచిన సందర్భంలోనూ చేసిన త్యాగాలు పడిన కష్టాలు అన్ని ఇన్ని కావు అనేక నిర్బంధాలకు ఓర్చు పార్టీని నిలబెట్టిన కామ్రేడ్స్ కు సెల్యూట్ చేయాల్సిందే. ఈ సుదీర్ఘ ప్రయాణంలో అనేకమంది కామ్రేడ్స్ నేలకొరిగారు. భూమి, భుక్తి , విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భారతదేశ ఉద్యమాలకు ఒక దిక్సూచిగా నిలిచింది. 1948లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని కొనసాగించాలా వద్దా అనే విషయంలో పార్టీలో తీవ్రమైన చర్చ జరిగింది ఆ సందర్భంలో దేశంలో పార్టీని ఎలా నడపాలి సాయుధ పోరాటాన్ని కొనసాగించాలా వద్దా అనే విషయంలో తర్జనభర్జనలు పడ్డ పార్టీ నేతలు రష్యా అధినేత కామ్రేడ్ స్టాలిన్ కలిసి సలహాలు తీసుకునేందుకు మాస్కోకు వెళ్లారు. ఆయనతో చర్చలు జరిపారు సుదీర్ఘంగా చర్చల అనంతరం భారతదేశ పరిస్థితులు సాయుధ పోరాటానికి అనుకూలంగా లేవని అందువల్ల దాన్ని కొనసాగించేందుకు ఆలోచన చేసుకోవాల్సిందేనని ఆయన వారికి సలహా ఇచ్చారు .దానికి అనుగుణంగా నాటి సాయుధ పోరాటాన్ని పార్టీ విరమించడం జరిగింది.

దేశంలో అనేక ప్రాంతాల్లో తిరుగుబాట్లు జరిగాయి. ప్రధానంగా పున్నప్పవాయిలార్, తెబాగ ,గదర్ పార్టీ ఉద్యమాలకు కమ్యూనిస్టులే నాయకత్వం వహించారు ఇది ఒక చరిత్ర. నాటి బ్రిటిష్ పాలకులు కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించారు. కమ్యూనిస్టుల వల్ల తమకు ప్రమాదం ఉందని భావించి కుట్ర కేసులు పెట్టారు. ముఖ్య నాయకులందరినీ జైళ్ళలో నిర్బంధించారు.నిర్బంధంలోనూ రహస్యంగా పార్టీని నడిపారు .

భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం సిద్ధించిన అనంతరం కమ్యూనిస్టు పార్టీ చట్టసభలలో ప్రవేశించింది. దేశంలో సోషలిజం తీసుకురావాలని ప్రయత్నాలు ప్రారంభించింది. చట్ట సభల్లోనూ బయట ఉద్యమాలకు బాటలు వేసింది. కార్మికుల, రైతుల పీడిత వర్గాల తరఫున తన గొంతు వినిపించింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీని నాటి పాలకులు దెబ్బతీసే ప్రయత్నాలు అనేకం చేశారు. అనేక మందిని ప్రలోభాల గురి చేశారు. అయినప్పటికీ కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ముందుకు తీసుకు పోయేందుకు లక్షలాదిమంది కామ్రేడ్స్ కష్టాలను సైతం లెక్కచేయకుండా పనిచేశారు. కమ్యూనిస్టుల ఉద్యమాలు త్యాగాలు ఫలితంగా నాటి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చట్టాలు చేయాల్సి వచ్చింది. నేడు కార్మిక వర్గం అనుభవిస్తున్న అనేక చట్టాలు నాటి కమ్యూనిస్టుల ఉద్యమ ఫలితమే . వాటిని తుంగలో తొక్కి కార్మిక వర్గ హక్కులను హరించేందుకు నేడు మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం పనిచేస్తుంది. కార్మికులు ఉద్యమాల ద్వారా సాధించుకున్న అనేక చట్టాలను రద్దుచేసి పెట్టుబడిదారులకు బహుళ జాతి కంపెనీలకు ఉపయోగపడే విధంగా చట్టాలు సవరించింది. దీనిపై కార్మిక వర్గం కన్నెర్ర చేస్తుంది . కార్మిక వర్గానికి వెన్నుదన్నుగా కమ్యూనిస్టు పార్టీలు నిలిచాయి.
మతతత్వ ఎజెండాతో ప్రజలను విడదీసి కేంద్రంలో బిజెపి సర్కార్ పాలన సాగిస్తుంది. మోడీ ఫాసిస్టు విధానాలు ప్రజలకు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారాయి . ప్రజల ఆకలి ఎజెండా కాకుండా మత ఎజెండాతో ముందుకు పోతుంది. కార్మిక రైతు ఉద్యమాలకు యువజన విద్యార్థులకు రక్షణ కరువైంది. వామపక్షాల మద్దతుతో ఢిల్లీలో జరిగిన సుదీర్ఘ రైతు ఉద్యమం మోడీ మెడలు వంచి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయించుకోగల్గింది .
కమ్యూనిస్టుల ఐక్యత ఆవశ్యం …

భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడ్డ తీరు ఎదిగిన విధానం చాలా గొప్పగా ఉన్నప్పటికీ సిద్ధాంత రాద్ధాంతాలతో ఉన్నా కాల క్రమంలో చీలికల పేలికలతో బలహీన పడుతూ వచ్చింది. నేటి పాలకులు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు కమ్యూనిస్టుల ఐక్యత ,ఆవశ్యకత అవసరం ఏర్పడింది .
1964 లో సిపిఐ సిపిఎం రెండుగా విడిపోవడం ఆ తర్వాత 1967లో సాయుధ పోరాట మే మార్గమని కొందరు నక్సలిజం పంథాను చేపట్టడం, అందులో కూడా రకరకాల సిద్ధాంతాల చర్చలతో చీలికలు పేలికలుగా కావడం కమ్యూనిస్టులు బలహీనపడటానికి కారణాలుగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ త్రిపుర కేరళ బీహార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కమ్యూనిస్టులు బలంగా ఉన్నప్పటికీ ఉత్తర భారతదేశం లో బలహీనత పార్టీ అనుకున్నంత స్థాయిలో ఎదగలేకపోయింది. సిపిఎం మూడు రాష్ట్రాలలో వామపక్ష ప్రభుత్వాలను నడిపినప్పటికీ ఒక కేరళ మినహా మిగతా రాష్ట్రాల్లో బలహీనపడటం దేశ వామపక్ష ఉద్యమానికి తీరని లోటుగా మిగిలింది. సాయుధ పోరాటం ద్వారానే దేశంలో సోషలిజం తెస్తామని మావోయిస్టులు అటవీ బాట పట్టిన ఫలితం లేకుండా పోయింది. వారిని తుద ముట్టించాలని కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని అనేకమంది కామ్రేడ్స్ ను మట్టు పెట్టింది. ప్రభుత్వ నిర్బంధాలతో అనేకమంది కామ్రేడ్స్ లొంగిపోయారు.

కమ్యూనిస్టులు ఎం సాధించారు .వారి పని అయిపోయింది అనే మాటలు తరచూ వినిపించేవి ..కానీ నేడు కమ్యూనిస్టుల ప్రాధాన్యత పెరిగింది వారు ఉండాలనే మాటలు క్రమేపి వినపడున్నాయి.. ప్రజల్లో కమ్యూనిస్టుల పై ఉన్న నమ్మకానికి అనుగుణంగా నడుచుకుంటే కమ్యూనిస్టులకు మంచి భవిషత్ ఉంటుందనడంలో సందేహంలేదు .
ప్రస్తుతం మోడీ నాయకత్వంలో ఉన్న బిజెపి ప్రభుత్వం తన ఫాసిస్టు విధానాల ద్వారా ప్రజల హక్కులను ప్రధానంగా కార్మిక కర్షకులు హక్కులను హరించి వేస్తుంది. రాజ్యాంగం లో ఉన్న లౌకిక ప్రజాస్వామ్యక విలువలకు తిలోదకాలు ఇచ్చే ప్రయత్నాలకు పునుకుంటుంది. అసలు రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలు చేస్తుంది. రాజ్యాంగ పరిరక్షణ కోసం అనేకమంది గళం విప్పుతున్నారు. కమ్యూనిస్టుల వాణి చట్టసభల్లో లేకుండా చేయాలని పాలకులు, కుట్రలు పన్నుతున్నారు. ఈ ధోరణి పీడిత తాడిత ఉద్యమాలకు తీరని నష్టం జరుగుతుంది. ఇందుకోసం కమ్యూనిస్టులు ఐక్యత అవసరం ఆవశ్యకత మరింత పెరిగింది. ఖమ్మంలో జరుగుతున్న సిపిఐ 100 సంవత్సరాల పండుగ సందర్భంగా దేశ ప్రజానీకానికి కమ్యూనిస్టుల ఐక్యత ప్రజా ఉద్యమాలపై ఒక స్పష్టమైన సందేశం ఇస్తారని ఆశిద్దాం… !