- అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ భార్య మృతి
- శనివారం జరిగిన దాడుల్లో తీవ్ర గాయాలపాలైన మన్సూరేహ్
- కోమాలోకి వెళ్లి సోమవారం ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడి
- ఇదే దాడుల్లో ఖమేనీ సహా పలువురు కుటుంబ సభ్యుల మరణం
- మధ్యప్రాచ్యంలో మరింత పెరిగిన యుద్ధ ఉద్రిక్తతలు
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఖమేనీ భార్య మన్సూరేహ్ ఖోజస్తే బాగెర్జాదే అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా జరిపిన దాడుల్లో తీవ్రంగా గాయపడి మరణించారు. శనివారం ఇరాన్పై జరిగిన వైమానిక దాడుల్లో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయని, ఆ తర్వాత కోమాలోకి వెళ్లి సోమవారం తుదిశ్వాస విడిచారని ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. ఆమె మరణంతో ‘షహీద్’ (అమరవీరుల) స్థాయికి చేరుకున్నారని ఆ దేశ ప్రసార సంస్థ ప్రెస్ టీవీ పేర్కొంది.
ఇదే దాడుల్లో అయతొల్లా ఖమేనీ కూడా మరణించినట్లు ఇరాన్ మీడియా ఇదివరకే ప్రకటించింది. కేవలం ఖమేనీ దంపతులే కాకుండా.. వారి కుమార్తె, మనవరాలు, కోడలు, అల్లుడు కూడా ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇరాన్ అత్యున్నత నాయకుడి కుటుంబం మొత్తం తీవ్ర ప్రభావానికి లోనైంది.
1947లో మష్హద్లోని ఓ వ్యాపారి కుటుంబంలో జన్మించిన మన్సూరేహ్, 1964లో ఖమేనీని వివాహం చేసుకున్నారు. వీరికి ఆరుగురు సంతానం కాగా, ఆమె జీవితాంతం బయటి ప్రపంచానికి దూరంగా, అంతర్ముఖంగానే ఉన్నారు. తాజా పరిణామాలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ఈ దాడులకు ప్రతీకారంగా దీర్ఘకాలిక యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ అధికారులు ప్రకటించడంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.