ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి జిల్లా నక్కపల్లి సమీపంలోని రాజయ్యపేటలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. రూ.1,35,964 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్కు నేటి సాయంత్రం భూమిపూజ నిర్వహించారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి ఈ ప్లాంట్ కీలకం కానుంది.
ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి, కేంద్ర సహాయమంత్రి శ్రీనివాస వర్మ, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, ఆర్సెలార్ మిట్టల్ అధినేత లక్ష్మీ మిట్టల్, కంపెనీ ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం వారు శిలాఫలకం ఆవిష్కరించారు.
అంతకుముందు, స్టీల్ ప్లాంట్ నిర్మాణ నమూనాను లక్ష్మీ మిట్టల్.. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి కుమారస్వామికి వివరించారు. అనంతరం, నేతలందరూ ప్లాంట్ స్థలంలో ఏర్పాటు చేసిన ఎక్స్పీరియన్స్ జోన్ను సందర్శించారు.
రాజయ్యపేటలో నిర్మిస్తున్న ఈ ప్లాంట్ ద్వారా ఏడాదికి 17.8 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. నిర్మాణ పనులు పూర్తి చేసి 2029 నుంచి ఉత్పత్తిని ప్రారంభించాలని కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ భారీ ప్రాజెక్టు రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చగలదని అంచనా వేస్తున్నారు. దీనిద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 