- ఈ నెల 14న ‘ప్రపంచ నిద్ర దినం’
- దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించిన ‘లోకల్ సర్కిల్’
- దేశంలో 2 శాతం మందికి మాత్రమే కంటి నిండా కునుకు
- మిగతా వారికి అంతంత మాత్రమే
అవును.. దేశ జనాభాలో దాదాపు 59 శాతం మందికి కంటినిండా కునుకు ఉండటం లేదట. ఎలాంటి అంతరాయం లేకుండా కనీసం ఆరు గంటలు కూడా ఏకధాటిగా నిద్రపోలేకపోతున్నారట. ఈ నెల 14న ‘ప్రపంచ నిద్ర దినం’ సందర్భంగా ‘లోకల్ సర్కిల్’ సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. సర్వేలో భాగంగా 343 జిల్లాల్లోని 40 వేల మంది అభిప్రాయాలు సేకరించారు. వీరిలో 61 శాతం మంది పురుషులు, 59 శాతం మంది మహిళలు ఉన్నారు.
‘లోకల్ సర్కిల్’ నివేదిక ప్రకారం.. 39 శాతం మంది మాత్రమే ఆరు నుంచి 8 గంటలపాటు నిద్రపోతున్నారట. మరో 39 శాతం మంది నాలుగు నుంచి ఆరు గంటలపాటు నిద్రపోతున్నారు. 2 శాతం మంది మాత్రమే కంటికి సరిపడా నిద్రపోతున్నారు. వీరు ప్రతి రోజు 8 నుంచి 10 గంటలపాటు నిద్రపోతున్నట్టు నివేదిక తెలిపింది. 20 శాతం మంది 4 గంటలు కూడా నిద్రపోవడం లేదు. మొత్తంగా చూసుకుంటే 59 శాతం మంది ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆరు గంటలు కూడా నిద్రపోవడం లేదు.
సరైన నిద్రకు నోచుకోకపోవడానికి గల కారణాలను కూడా ‘లోకల్ సర్కిల్’ వెల్లడించింది. ఆలస్యంగా నిద్రపోవడం, త్వరగా లేవాల్సి రావడం, సెల్ఫోన్లు, దోమలు, బయటి శబ్దాలు, పిల్లల అల్లరి కారణంగా సరిగా నిద్రపోలేకపోతున్నట్టు సర్వేలో పాల్గొన్న పలువురు పేర్కొన్నారు.