తెలంగాణ వార్తలు

మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు రూ. 182 కోట్ల జీరో టిక్కెట్లు జారీ: మల్లు భట్టివిక్రమార్క

  • తెలంగాణలో మహిళలకు రూ. 182 కోట్ల విలువైన జీరో టికెట్లు జారీ
  • మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి రూ. 6,088 కోట్లు చెల్లించిన ప్రభుత్వం
  • సూర్యాపేట ఆర్టీసీ డిపోలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఉపముఖ్యమంత్రి

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం విజయవంతంగా కొనసాగుతోందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు రూ. 182 కోట్ల విలువైన జీరో టికెట్లను జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. సోమవారం సూర్యాపేట ఆర్టీసీ డిపోలో కొత్తగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ బస్సులను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భట్టి విక్రమార్క ప్రసంగించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు అందిస్తున్న ఉచిత ప్రయాణ సేవలకు సంబంధించి కొందరు వ్యక్తం చేసిన ఆందోళనలు అవాస్తవమని ఉపముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మహిళలు ఉచితంగా ప్రయాణించినప్పటికీ, ఆ మొత్తాన్ని ప్రభుత్వం ఆర్టీసీకి క్రమం తప్పకుండా చెల్లిస్తోందని ఆయన తెలిపారు. ఇప్పటివరకు ఈ పథకం కింద తెలంగాణ ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం రూ. 6,088 కోట్లు చెల్లించిందని వివరించారు. “ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ బస్సులు పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయి. దీనివల్ల సంస్థ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఎంతగానో దోహదపడుతోంది” అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఉచిత ప్రయాణ పథకంపై వచ్చిన అనుమానాలను నివృత్తి చేస్తూ, ఆర్టీసీకి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

Related posts

నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు కాల్‌!

Ram Narayana

తెలంగాణలో గాలివాన బీభత్సం.. 13 మంది మృత్యువాత…

Ram Narayana

నన్ను గెలిపిస్తే ఈ పనులన్నీ చేసి పెడతా.. మ్యానిఫెస్టో విడుదల చేసిన సర్పంచ్ అభ్యర్థి

Ram Narayana