జాతీయ వార్తలు

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీలో వరదల భీభత్సవం …

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో సంభవించిన ఆకస్మిక వరదలు పెను నష్టాన్నే మిగిల్చాయి. ఈ ఘటనలో సైనిక శిబిరం కూడా తీవ్రంగా దెబ్బతింది. 11 మంది సైనికులు గల్లంతైనట్లు సమాచారం. కాగా, ఈ విషాదానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోలు గుండెను బరువెక్కిస్తున్నాయి. ధారాలి గ్రామంలో ఒక వ్యక్తి బురదలోంచి బయటకు రావడానికి కష్టపడుతుండగా, మరొకరు ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగెత్తే హృదయవిదారక దృశ్యం కనిపించింది.

ధారాలి, సుఖీ టాప్ ప్రాంతాలలో సంభవించిన రెండు మేఘ విస్ఫోటనాల వల్ల పెను విధ్వంసం జరిగింది. ముఖ్యంగా ధారాలి గ్రామం తీవ్రంగా దెబ్బతింది. కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలతో ఈ ప్రాంతం అతలాకుతలమైంది. మంగళవారం మధ్యాహ్నం వచ్చిన ఆకస్మిక వరదల కారణంగా ధారాలి గ్రామం దాదాపు సగం వరకు ధ్వంసమైందని పీటీఐ నివేదించింది. ధారాలి గ్రామం గంగోత్రికి వెళ్లే మార్గంలో ఒక ముఖ్యమైన ప్రదేశం. ఇప్పటివరకు ఈ ఘటనలో నలుగురు మరణించినట్టు నిర్ధారించారు. 130 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

గల్లంతైన వారిని గుర్తించడానికి, సహాయక చర్యల కోసం భారత సైన్యం ఎంఐ-17, చినూక్ హెలికాప్టర్లను రంగంలోకి దించింది. భారత సైన్యం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డీఆర్ఎఫ్) సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటివరకు సుమారు 130 మందిని రక్షించినట్టు ఉత్తరాఖండ్ ప్రభుత్వ అధికారులు తెలిపారు.

Related posts

కొత్త సీజేఐ కోసం అధికారిక కారును రాష్ట్రపతి భవన్ వద్ద వదిలి వెళ్లిన జస్టిస్ గవాయ్

Ram Narayana

ఏడాదికి 100 అణ్వాయుధాలు పోగేస్తున్న చైనా .. భారత్ కంటే మూడింతలకు పైగా వార్‌హెడ్‌లు!

Ram Narayana

పేపర్ లీకేజీలపై గుజరాత్ ప్రభుత్వం ఉక్కుపాదం..

Drukpadam