తెలంగాణ వార్తలు

జనజీవన స్రవంతిలోకి మావోయిస్టు కాకరాల సునీత..

  • మాజీ మావోయిస్టులు సునీత, హరీశ్‌కు ఆర్థిక సాయం
  • సునీతకు రూ. 20 లక్షలు, హరీశ్‌కు రూ. 4 లక్షల చెక్కులు
  • ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామని సీపీ సుధీర్ బాబు హామీ
  • మావోయిజం సిద్ధాంతానికి కాలం చెల్లిందన్న రాచకొండ సీపీ
  • మావోయిస్టు రిక్రూట్‌మెంట్లు నిలిచిపోయాయని వెల్లడి
  • తెలంగాణలో ఇప్పటివరకు 387 మంది నక్సల్స్ లొంగుబాటు

నాలుగు దశాబ్దాల పాటు మావోయిస్టు ఉద్యమంలో పనిచేసి, ఇటీవల జనజీవన స్రవంతిలో కలిసిన కాకరాల సునీత, చెన్నూరి హరీశ్‌లకు రాచకొండ పోలీసులు ఆర్థిక చేయూత అందించారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు వీరికి పునరావాస ప్యాకేజీ కింద చెక్కులను అందజేశారు. సునీతకు రూ. 20 లక్షలు, హరీశ్‌కు రూ. 4 లక్షల చెక్కును అందించారు. వీరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ “మావోయిజం సిద్ధాంతానికి కాలం చెల్లింది. గతంలో సరైన ఆదాయ వనరులు లేకపోవడంతో చాలామంది నక్సలిజం వైపు ఆకర్షితులయ్యారు, కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి” అని వ్యాఖ్యానించారు. కొంతకాలంగా మావోయిస్టు రిక్రూట్‌మెంట్లు నిలిచిపోయాయని, ఒకవేళ ఎవరైనా యువత అటువైపు వెళ్లినా, భావజాలం నచ్చక తిరిగి వస్తున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 387 మంది నక్సలైట్లు లొంగిపోయిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

దాదాపు నాలుగు దశాబ్దాల పాటు అజ్ఞాతంలో గడిపిన సునీత, గతంలో ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు అగ్రనేత సుధాకర్ జీవిత సహచరి. ప్రముఖ సినీ నటుడు, విప్లవ రచయితల సంఘం (విరసం) సభ్యుడు కాకరాల సత్యనారాయణ కుమార్తె అయిన సునీత, 1986లో పీపుల్స్ వార్ గ్రూప్‌లో చేరారు. ఆమె మొదటి భర్త టీఎల్ఎన్ చలం కూడా అన్నపురం ఎన్‌కౌంటర్‌లో మరణించారు. సునీత సోదరి మాధవి ఇంకా మావోయిస్టు పార్టీలోనే ఉన్నారని పోలీసులు వెల్లడించారు. మరోవైపు, చెన్నూరి హరీశ్ మావోయిస్టు అగ్రనేతలకు అనుచరుడిగా పనిచేశారని అధికారులు తెలిపారు.

Related posts

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు… మంత్రి పొంగులేటి

Ram Narayana

ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు… బంజారాహిల్స్ పీఎస్‌లో కేటీఆర్‌పై కేసు నమోదు!

Ram Narayana

హైదరాబాదులో నీటి ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి!

Ram Narayana