జాతీయ వార్తలు

  ముంబై ఆసుపత్రిలో కెప్టెన్ రోహిత్… హిట్‌మ్యాన్‌కు ఏమైంది?..

  • ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో కనిపించిన రోహిత్ శర్మ
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటోలు, వీడియోలు
  • హిట్‌మ్యాన్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో తీవ్ర ఆందోళన
  • సాధారణ హెల్త్ చెకప్‌ కోసమేనంటున్న కొన్ని రిపోర్టులు
  • కీలకమైన ఆస్ట్రేలియా టూర్‌కు ముందు రీఎంట్రీకి సిద్ధమవుతున్న కెప్టెన్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆయన ఆసుపత్రి వద్ద ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ కావడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కీలకమైన సిరీస్‌లు దగ్గర పడుతున్న సమయంలో రోహిత్ ఆసుపత్రికి వెళ్లడం ఏంటని ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే, రోహిత్ ఆసుపత్రికి ఎందుకు వెళ్లారనే దానిపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఇది కేవలం సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగమేనని కొన్ని వార్తలు వస్తున్నాయి. బిజీ క్రికెట్ షెడ్యూల్‌కు ముందు ఆటగాళ్లు ఇలాంటి చెకప్స్ చేయించుకోవడం మామూలే అయినప్పటికీ, చాలాకాలం తర్వాత రోహిత్ మైదానంలోకి రీఎంట్రీ ఇవ్వనుండటంతో ఫ్యాన్స్‌లో టెన్షన్ మొదలైంది. ఈ ఫొటోలు బయటకు రాగానే #RohitSharma అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. హిట్‌మ్యాన్‌కు ఏమైందోనని కొందరు ఆందోళన వ్యక్తం చేయగా, మరికొందరు మాత్రం ఇది రొటీన్ ఫిట్‌నెస్ టెస్టు మాత్రమేనని అభిప్రాయపడ్డారు.

చాలా నెలల విరామం తర్వాత రోహిత్ శర్మ తిరిగి వన్డే జట్టు కెప్టెన్‌గా బరిలోకి దిగనుండటంతో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన చివరిసారిగా మార్చిలో అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. వచ్చే నెలలో ఆస్ట్రేలియా ‘ఏ’ జట్టుతో జరగనున్న అనధికారిక సిరీస్‌తో రోహిత్ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో జరిగే కీలక పర్యటనకు సన్నద్ధమయ్యేందుకే రోహిత్ ఈ సిరీస్‌లో ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఆస్ట్రేలియాతో భారత్ అక్టోబర్, నవంబర్ నెలల్లో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. అక్టోబర్ 19, 23, 25 తేదీల్లో పెర్త్, అడిలైడ్, సిడ్నీ వేదికగా వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండటం జట్టుకు అత్యంత కీలకం.

Related posts

సూట్‌కేసులో కాంగ్రెస్ మహిళా కార్యకర్త మృతదేహం!

Ram Narayana

వెజ్‌ శాండ్‌విచ్ ఆర్డరిస్తే నాన్‌ వెజ్ డెలివరీ.. రూ.50 లక్షల పరిహారానికి మహిళ డిమాండ్

Ram Narayana

సిందూరం మొక్క‌ను నాటిన ప్ర‌ధాని మోదీ

Ram Narayana