తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీం
హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచన
సుప్రీం తో సంబంధం లేకుండా తదుపరి విచారణ చేపట్టాలని హైకోర్టు కు సూచన
పాత పద్దతిలో ఎన్నికలకు వెళ్లవచ్చునని పేర్కొన్న సుప్రీం
50 శాతం పరిమితి దాటవద్దని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం
బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టులో పెండింగ్లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా తదుపరి విచారణ చేపట్టాలని హైకోర్టుకు సూచించింది. మెరిట్స్ ప్రకారం విచారణ కొనసాగించాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. కావాలనుకుంటే ప్రభుత్వం పాత రిజర్వేషన్లపై ఎన్నికలకు వెళ్లవచ్చని సూచనలు చేసింది.
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 9పై హైకోర్టు విధించిన స్టేను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఈ నెల 9న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 13వ తేదీన పిటిషన్ దాఖలు చేసింది. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా 16, 17వ తేదీల్లో ఏదో ఒకరోజు ఈ అంశంపై విచారించాలని మంగళవారం సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ముందు మెన్షన్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లుగానే రిజిస్ట్రీ ఈ కేసును నేటి విచారణ జాబితాలో చేర్చింది. అయితే సుప్రీంకోర్టు దీనిపై విచారణకు నిరాకరించింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను పెంచాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రిజర్వేషన్లు 50 శాతం పరిమితికి లోబడే ఉండాలని స్పష్టం చేసిన సర్వోన్నత న్యాయస్థానం, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను కొట్టివేసింది. అవసరమైతే పాత రిజర్వేషన్ల విధానంతోనే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వానికి సూచించింది.
వివరాల్లోకి వెళితే, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 9పై హైకోర్టు గతంలో స్టే విధించింది. ఈ స్టేను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. రాష్ట్రవ్యాప్తంగా కులగణన సర్వే నిర్వహించి, శాస్త్రీయంగానే రిజర్వేషన్లను పెంచాలని నిర్ణయించామని, దీనిపై అసెంబ్లీలో కూడా అన్ని పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయని కోర్టుకు వివరించారు.
అయితే, రిజర్వేషన్లు 50 శాతం మించరాదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన కృష్ణమూర్తి తీర్పు స్పష్టంగా చెబుతోందని ప్రతివాదుల తరఫు న్యాయవాది బలంగా వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టులో విచారణ కొనసాగుతున్నందున తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. ఈ దశలో పిటిషన్ను విచారణకు స్వీకరించలేమని పేర్కొంటూ కొట్టివేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా ఈ కేసులో విచారణను కొనసాగించాలని హైకోర్టుకు సూచించింది.
సుప్రీంకోర్టు తాజా తీర్పుతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మళ్లీ ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. త్వరలో జరగనున్న కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.