అంతర్జాతీయం

భద్రతా వలయంలో ఇస్లామాబాద్.. నగరం లాక్‌డౌన్…

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో అమెరికా, ఇరాన్ మధ్య చారిత్రక శాంతి చర్చలకు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికైంది. అత్యంత సున్నితమైన ఈ భేటీ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం నగరాన్ని పూర్తి భద్రతా వలయంలోకి తీసుకువచ్చింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కనీవినీ ఎరుగని భద్రతా చర్యలు చేపట్టింది.

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం, ఇరాన్ అధికారుల రాక సందర్భంగా ఇస్లామాబాద్‌లో దాదాపు లాక్‌డౌన్ వాతావరణం నెలకొంది. ఏప్రిల్ 10, 11 తేదీల్లో (శుక్ర, శనివారాలు) ప్రభుత్వ సెలవులు ప్రకటించారు. దీంతో అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, మార్కెట్లు మూతపడ్డాయి. చర్చలు జరిగే సెరీనా హోటల్ చుట్టూ 3 కిలోమీటర్ల పరిధిలో సాధారణ ప్రజల కదలికలపై ఆంక్షలు విధించారు. వ్యూహాత్మక ప్రాంతమైన ‘రెడ్ జోన్‌’కు వెళ్లే రహదారులను కంటైనర్లతో మూసివేసి, వేలాది మంది పోలీసు, పారామిలటరీ బలగాలను మోహరించారు.

ఈ చర్చల్లో పశ్చిమాసియాలో శాంతి స్థాపన, హర్మూజ్ జలసంధి మీదుగా చమురు రవాణా భద్రత, ఇరాన్‌పై ఆంక్షల సడలింపు వంటి కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశముందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, ఈ చర్చలు విఫలమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే హెచ్చరించడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దశాబ్దాల తర్వాత జరుగుతున్న ఈ ముఖాముఖి చర్చల ఫలితంపై యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Related posts

కమలా హారిస్‌కు మద్దతుగా ఏఆర్ రెహ్మాన్ ప్రచారం..

Ram Narayana

ఈసారి ఐక్యరాజ్య సమితి.. కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన యూఎన్

Ram Narayana

భారీ గెలుపు తర్వాత భారత్‌పై తారిక్ రెహమాన్ తొలి స్పందన…

Ram Narayana