జాతీయ వార్తలు

బెంగళూరు లాడ్జిలో విద్యార్థి అనుమానాస్పద మృతి.. మిస్టరీగా మారిన ప్రియురాలి అదృశ్యం!

  • బెంగళూరు మడివాళలో వెలుగు చూసిన ఘటన
  • గది నుంచి దుర్వాసన రావడంతో బయటపడ్డ విషయం
  • కనిపించకుండా పోయిన యువతి.. సీసీటీవీలో దృశ్యాలు రికార్డు
  • యువతిని పంపించాకే యువకుడు మరణించినట్టు గుర్తింపు
  • అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న మడివాళ పోలీసులు

నగరంలోని మడివాళలో ఉన్న ఓ ప్రముఖ లాడ్జిలో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. ఎనిమిది రోజులుగా తన ప్రియురాలితో కలిసి ఉంటున్న తక్షిత్ (20) అనే విద్యార్థి శనివారం శవమై కనిపించాడు. అతడితో పాటు గదిలో ఉన్న యువతి కనిపించకుండా పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

మడివాళ పోలీసుల కథనం ప్రకారం.. దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరుకు చెందిన తక్షిత్, విరాజపేటకు చెందిన అతని ప్రియురాలు (20) ఎనిమిది రోజుల క్రితం లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. వీరిద్దరూ తమిళనాడులోని పణంబూరులో ఒకే కళాశాలలో బీబీఎం చదువుతున్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం కావాలని, స్నేహితుల ఇంట్లో ఉండి చదువుకుంటామని ఇళ్లలో అబద్ధం చెప్పి బెంగళూరుకు వచ్చారు. లాడ్జిలో దిగిన నాటి నుంచి ఆహారం, కాఫీ వంటివి తమ గదికే తెప్పించుకునేవారు.

గత గురువారం రాత్రి ఫుడ్ పాయిజనింగ్ అయిందని చెప్పి ఇద్దరూ మెడికల్ షాపు నుంచి మందులు తెచ్చుకుని వాడినట్లు తెలిసింది. ఆ తర్వాత శుక్రవారం ఉదయం నుంచి వారి గది తలుపులు తెరుచుకోలేదు. శనివారం గది నుంచి తీవ్ర దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి బలవంతంగా తలుపులు తెరిచి చూడగా, మంచంపై తక్షిత్ మృతదేహం కనిపించింది.

పోలీసులు లాడ్జిలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా కీలక విషయం బయటపడింది. తక్షిత్ చనిపోవడానికి కొన్ని గంటల ముందే తన ప్రియురాలిని ఊరికి పంపించినట్లు రికార్డయింది. ఆమెను పంపించి తిరిగి గదికి వచ్చిన తర్వాతే అతడు మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం అదృశ్యమైన యువతి కోసం గాలిస్తున్నారు. ఆమె ఆచూకీ లభిస్తేనే ఈ మృతి వెనుక ఉన్న మిస్టరీ వీడుతుందని భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

రైతాంగ పోరాటనికి దిగివచ్చిన కర్ణాటక సర్కార్ ..

Ram Narayana

తెలంగాణకు చెందిన ఆటిజం బాధితుడిపై మోదీ ప్రశంసల వర్షం…

Drukpadam

ఆయన మాటలే నిప్పురాజేశాయి.. లేహ్ అల్లర్లపై కేంద్ర హోం శాఖ సీరియస్

Ram Narayana