అంతర్జాతీయం

యురేనియం శుద్ధి ఆపబోం అమెరికాకు తేల్చి చెప్పిన ఇరాన్

  • తమ విధానాలను నిర్దేశించే హక్కు ఎవరికీ లేదని తేల్చిచెప్పిన విదేశాంగ మంత్రి
  • అమెరికాతో చర్చలు జరుగుతున్నప్పటికీ అణు విధానంలో మార్పు ఉండబోదని వెల్లడి
  • అమెరికా సైనిక మోహరింపులకు భయపడబోమని వ్యాఖ్య

అణు కార్యక్రమం విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఇరాన్ మరోసారి స్పష్టం చేసింది. యురేనియం శుద్ధి చేసే తమ హక్కును ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోబోమని, తమ విధానాలను నిర్దేశించే హక్కు ఏ దేశానికీ లేదని తేల్చి చెప్పింది. అమెరికాతో చర్చలు జరుగుతున్నప్పటికీ, తమపై ఒత్తిడి తెచ్చి లొంగదీసుకోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించింది.

టెహ్రాన్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. “మాపై యుద్ధం రుద్దినా సరే, యురేనియం శుద్ధిని ఎందుకు వదులుకోమంటే.. మా ప్రవర్తనను శాసించే హక్కు ఎవరికీ లేదు” అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. అమెరికాతో అణు ఒప్పందంపై ఒమన్‌లో పరోక్ష చర్చలు ఇటీవల తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో అబ్బాస్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

అమెరికా ఉద్దేశాలపై తమకు తీవ్ర అనుమానాలు ఉన్నాయని అరఘ్చీ పేర్కొన్నారు. తమను భయపెట్టేందుకే ఈ ప్రాంతంలో యూఎస్ఎస్ అబ్రహం లింకన్ విమానవాహక నౌకను మోహరించారని, ఇలాంటి సైనిక చర్యలకు తాము భయపడబోమని స్పష్టం చేశారు. అయితే, శాంతియుత ప్రయోజనాల కోసం యురేనియం శుద్ధి చేసే తమ హక్కును గుర్తిస్తేనే ఒప్పందం సాధ్యమవుతుందని తెలిపారు. క్షిపణి కార్యక్రమం వంటి ఇతర అంశాలపై చర్చించే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు.

ప్రస్తుతం ఇరు దేశాలు ఒమన్ చర్చల ఫలితాలను సమీక్షిస్తున్నాయి. త్వరలోనే మరో విడత చర్చలు జరిగే అవకాశం ఉందని అబ్బాస్ అంచనా వేశారు. ఇదే అంశంపై చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు, ఇజ్రాయెల్ ప్రధాని ఫిబ్రవరి 11న సమావేశం కానున్నారు.

Related posts

ఎలాన్ మస్క్ ద్వారా బిడ్డను కన్నా.. రచయిత్రి ఆష్లీ ప్రకటన!

Ram Narayana

ట్రంప్ గెలుపు కోసం ఎలాన్ మ‌స్క్ ఎంత‌ ఖ‌ర్చు చేశాడో తెలిస్తే షాక‌వ్వాల్సిందే!

Ram Narayana

పాలస్తీనాకు మద్దతుగా ఇటలీలో హింస.. భగ్గుమన్న నిరసనలు!

Ram Narayana