- మొత్తం 299 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు
- షేక్ హసీనా పార్టీ లేకుండా తొలిసారి జరుగుతున్న ఎలెక్షన్స్
- జమాతే ఇస్లామీ పార్టీ గెలిస్తే హిందువులపై దాడులు మరింత పెరిగే అవకాశం
ఏడాదికి పైగా తీవ్ర రాజకీయ అనిశ్చితిలో ఉన్న బంగ్లాదేశ్ లో ఈరోజు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఏడాదిన్నర క్రితం షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఆ దేశం రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. అప్పటి నుంచి ఆ దేశ పాలనను మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. మహమ్మద్ యూనస్ ఢాకాలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ ఎన్నికల తర్వాత బంగ్లాదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. మొత్తం 299 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 1,981 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. సుమారు 12.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ ను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో, ఆ పార్టీ లేకుండానే తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాతే ఇస్లామీ కూటమి మధ్య ఉంది.
షేక్ హసీనా ప్రస్తుతం ఇండియాలో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత ఆ దేశంలో హిందువులపై దాడులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు పలువురు హిందువులను దారుణంగా హత్య చేశారు. ఈ ఎన్నికల్లో జమాతే ఇస్లామీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే హిందువులపై దాడులు మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.