- బంగ్లాదేశ్ 11వ ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారం
- రాజ్యాంగ సంస్కరణల మండలి ప్రమాణంపై బీఎన్పీ ఎంపీల నిరాకరణ
- ఎంపీలతో తొలిసారిగా ప్రమాణం చేయించిన ప్రధాన ఎన్నికల కమిషనర్
- నూతన ప్రభుత్వం ముందు ఇస్లామిక్ తీవ్రవాదాన్ని అరికట్టే సవాలు
బంగ్లాదేశ్లో కొత్త రాజకీయ అధ్యాయం మొదలైంది. దేశ 11వ ప్రధానమంత్రిగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఛైర్మన్ తారిక్ రెహ్మాన్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన 13వ పార్లమెంటరీ ఎన్నికల్లో బీఎన్పీ ఘన విజయం సాధించడంతో ఆయన ప్రధాని పీఠాన్ని అధిష్టించారు. దాదాపు 35 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బంగ్లాదేశ్కు ఒక పురుషుడు ప్రధాని కావడం విశేషం.
ఢాకాలోని జాతీయ పార్లమెంట్ సౌత్ ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్, తారిక్ రెహ్మాన్తో ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు 50 మంది సభ్యుల మంత్రివర్గం కూడా ప్రమాణం చేసింది. ఈ కేబినెట్లో 25 మంది మంత్రులు, 24 మంది సహాయ మంత్రులు, ముగ్గురు టెక్నోక్రాట్లు ఉన్నారు. తొలిసారి ఎన్నికైన వారితో పాటు పలువురు కొత్త ముఖాలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు.
అంతకుముందు, పార్లమెంట్ సభ్యులుగా బీఎన్పీకి చెందిన 209 మంది ఎంపీలు ప్రమాణం చేశారు. అయితే, రాజ్యాంగ సంస్కరణల మండలి ప్రమాణ పత్రంపై సంతకాలు చేయడానికి పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు వారు నిరాకరించారు. తాము కౌన్సిల్ సభ్యులుగా ఎన్నిక కాలేదని, అందుకే ఆ ప్రమాణాన్ని స్వీకరించబోమని బీఎన్పీ నేత సలావుద్దీన్ అహ్మద్ స్పష్టం చేశారు.
బీఎన్పీ వైఖరిని నిరసిస్తూ జమాత్-ఎ-ఇస్లామీ, ఇస్లామీ ఆందోళన్, నేషనల్ సిటిజన్స్ పార్టీ (ఎన్సీపీ)లతో కూడిన 11 పార్టీల కూటమి తొలుత ప్రమాణ స్వీకారాన్ని బహిష్కరించాలని నిర్ణయించింది. అయితే, కొద్దిసేపటికే ఈ రాజకీయ డ్రామాకు తెరపడింది. జమాత్ నేతృత్వంలోని కూటమి, స్వతంత్రులు, ఇస్లామీ ఆందోళన్ బంగ్లాదేశ్, ఎన్సీపీ ఎంపీలు వేర్వేరుగా ప్రమాణం చేశారు. దేశ చరిత్రలో తొలిసారిగా ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) ఏఎంఎం నసీర్ ఉద్దీన్ కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ప్రమాణం చేయించడం గమనార్హం.
ఫిబ్రవరి 12న 299 పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీఎన్పీ 209 సీట్లు గెలుచుకోగా, రాడికల్ ఇస్లామిస్ట్ పార్టీ అయిన జమాత్-ఎ-ఇస్లామీ 68 స్థానాల్లో విజయం సాధించింది. రెండు చోట్ల గెలిచిన తారిక్ రెహ్మాన్, బోగ్రా-6 స్థానాన్ని వదులుకుని, ఢాకా-17 ఎంపీగా ప్రమాణం చేశారు. గత 18 నెలలుగా మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వ హయాంలో పెరిగిన అశాంతి, ఇస్లామిక్ తీవ్రవాదాన్ని అరికట్టడం కొత్త ప్రభుత్వానికి అతిపెద్ద సవాలుగా నిలవనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
కాగా, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. బంగ్లాదేశ్ లో కొలువుదీరిన నూతన ప్రభుత్వానికి ఆయన భారత్ తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు.