పార్లమంట్ న్యూస్ ...

అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్ సభ ఆమోదం… రేపు రాజ్యసభ ముందుకు బిల్లు

ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బుధవారం ‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సవరణ బిల్లు-2026’ను సభలో ప్రవేశపెట్టారు. చర్చ అనంతరం, ఈ బిల్లు ఆమోదం పొందినట్లు ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ ప్రకటించారు.

ఈ బిల్లుపై సభలో సుమారు రెండు గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు బిల్లుకు మద్దతు పలకగా, వైసీపీ ఎంపీలు చర్చ మధ్యలో సభ నుంచి వాకౌట్ చేశారు. 2024 జూన్ 2 నుంచి ఈ సవరణ వర్తించేలా బిల్లులో పొందుపరిచారు. ఈ చట్ట సవరణతో రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధానిగా చట్టపరమైన భద్రత లభిస్తుంది.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, “అమరావతి రైతుల కన్నీళ్ల మీద ఈ చట్టం నిర్మాణమైంది. ఇది ఆంధ్ర ప్రజల కలల రాజధాని” అని అన్నారు. బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ, “అమరావతి ఆంధ్రప్రదేశ్‌కు శాశ్వత రాజధానిగానే ఉంటుంది” అని స్పష్టం చేశారు.

లోక్‌సభ ఆమోదం పొందిన ఈ బిల్లు రేపు గురువారం (ఏప్రిల్ 2) రాజ్యసభ ముందుకు వెళ్లనుంది. పెద్దల సభలో కూడా ఆమోదం పొందితే, రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారనుంది. దీంతో గతంలో వచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదనకు చట్టపరంగా తెరపడినట్లవుతుంది.

Related posts

లోక్‌సభలో వీడిన ప్రతిష్టంభన.. ఓటర్ల జాబితా సవరణపై నేడు కీలక చర్చ…

Ram Narayana

రాజ్యసభలో తగ్గిన బీజేపీ సంఖ్యాబలం.. మెజారిటీకి 12 సీట్ల దూరంలో ఎన్డీయే…

Ram Narayana

పార్లమెంటులో బహిష్కరణకు గురైన తొలి ఎంపీ ఎవరో తెలుసా?

Ram Narayana