- క్యాతనపల్లిలోని నివాసంలో సుమన్ను అరెస్టు చేసిన పోలీసులు
- అడ్డుకునే ప్రయత్నం చేసిన కార్యకర్తలపై లాఠీఛార్జ్
- కాన్వాయ్పై దాడి కేసులో ఏ1గా బాల్క సుమన్
తెలంగాణ రాష్ట్ర మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి కేసులో బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పోలీసులు అరెస్టు చేశారు. సుమన్ను అరెస్టు చేసే సమయంలో కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయగా, పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు.
క్యాతనపల్లిలోని ఆయన నివాసంలో బాల్క సుమన్ను అరెస్టు చేసిన పోలీసులు మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం రామగుండం తరలించనున్నారు. వివేక్ కాన్వాయ్పై దాడికి సంబంధించి రామకృష్ణాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఏ1గా బాల్క సుమన్, ఏ2గా మూల రాజిరెడ్డి పేర్లను పేర్కొన్నారు.
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ స్థానాలు వచ్చాయి. అయితే కుట్రపూరితంగా మున్సిపాలిటీని చేజిక్కించుకోవాలని మంత్రి వివేక్ ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఈరోజు బీఆర్ఎస్, సీపీఐ పార్టీలు కలిసి క్యాతనపల్లి బంద్ కు పిలుపునిచ్చాయి.