- యూపీఐ వ్యవస్థపై ఫ్రాన్స్ అధ్యక్షుడి ప్రశంసల జల్లు
- 140 కోట్ల మంది పౌరులకు డిజిటల్ గుర్తింపు కల్పించిందని వ్యాఖ్య
- జైపూర్ లో ప్రధాని మోదీతో యూపీఐ అనుభవాన్ని ప్రస్తావించిన మాక్రాన్
భారతదేశానికి చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) వ్యవస్థను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కొనియాడారు. 140 కోట్ల మంది పౌరులకు డిజిటల్ గుర్తింపును కల్పిస్తూ భారత్ నిర్మించిన ఈ వ్యవస్థను ప్రపంచంలో మరే దేశమూ సాధించలేకపోయిందని ఆయన ప్రశంసించారు. ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో బుధవారం మాక్రాన్ మాట్లాడుతూ, సాంకేతికత సామాన్యుల జీవితాలను ఎలా మార్చివేసిందో వివరించారు.
ముంబై వీధి వ్యాపారి ఉదాహరణతో..
మాక్రాన్ తన ప్రసంగంలో ముంబై వీధి వ్యాపారితో తన వ్యక్తిగత అనుభవాన్ని ప్రస్తావించారు. ‘‘పదేళ్ల క్రితం ముంబైలోని ఒక వీధి వ్యాపారికి బ్యాంక్ ఖాతా తెరవడానికి చిరునామా లేదు, సరైన పత్రాలు లేవు. కానీ ఈ రోజు, అదే వ్యాపారి తన ఫోన్ ద్వారా దేశంలో ఎవరి నుంచైనా తక్షణమే, ఉచితంగా నగదును స్వీకరించగలుగుతున్నారు’’ అని మాక్రాన్ పేర్కొన్నారు. 140 కోట్ల మందికి డిజిటల్ గుర్తింపును అందించడం ద్వారా భారత్ అద్భుతం సృష్టించిందని ఆయన కొనియాడారు.
జైపూర్లో యూపీఐ అనుభవం..
2024లో మాక్రాన్ భారత్ లో పర్యటించినప్పుడు ప్రధాని మోదీతో కలిసి జైపూర్లోని హవా మహల్ సమీపంలో కుల్హాద్ టీ తాగారు. అప్పుడు ప్రధాని మోదీ తన మొబైల్ ఫోన్ ద్వారా బిల్లు చెల్లించడం చూసి మాక్రాన్ ఆశ్చర్యపోయారు. యూపీఐ వ్యవస్థ పనితీరు గురించి మోదీ ఆయనకు వివరించారు.
ఫ్రాన్స్లో యూపీఐ సేవలు..
ఫ్రాన్స్లో యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రధాని మోదీ 2023 జూలైలో ప్రకటించారు. 2024 ఫిబ్రవరిలో భారత్ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను స్వీకరించిన తొలి యూరోపియన్ దేశంగా ఫ్రాన్స్ నిలిచింది. ఎన్ పీసీఐ ఇంటర్నేషనల్ మరియు ఫ్రాన్స్కు చెందిన ‘లైరా’ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంతో ఫ్రాన్స్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో యూపీఐ చెల్లింపులు ప్రారంభమయ్యాయి.
దీనివల్ల ఫ్రాన్స్కు వెళ్లే భారతీయ పర్యాటకులు, విద్యార్థులు తమ వద్ద ఉన్న యూపీఐ యాప్స్ ద్వారా సులభంగా చెల్లింపులు చేయగలుగుతున్నారు. భారతదేశం నిర్మించిన ఈ డిజిటల్ మౌలిక సదుపాయాలు ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని మాక్రాన్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.