- ఢిల్లీ పర్యటనలో డీజీపీతో కలిసి అమిత్ షాను కలిసిన రేవంత్ రెడ్డి
- మావోయిస్టుల లొంగుబాటు, పరిణామాలపై చర్చించిన హోంమంత్రి, సీఎం
- ఈ నెల 31న జరగనున్న మావోయిస్టు రహిత భారత్ కాన్ఫరెన్సుపై చర్చ
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో డీజీపీ శివధర్ రెడ్డి, ఎస్ఐబీ చీఫ్ సుమతి పాల్గొన్నారు. మావోయిస్టుల లొంగుబాటు, ఆయా ప్రాంతాల్లోని పరిణామాలపై వారు చర్చించారు. ఈ నెల 31న జరగనున్న మావోయిస్టు రహిత భారత్ కాన్ఫరెన్స్ పై చర్చించారు.
ఇటీవల కీలక మావోయిస్టు నేతలు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టు ముఖ్య నాయకులు సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వివిధ అంశాలపై చర్చించారు. సచివాలయంలో లొంగిపోయిన వారితో జరిగిన చర్చను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది.
మావోయిస్టుల లొంగుబాట్లు మహారాష్ట్ర, తెలంగాణలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొన్నిరోజుల క్రితం దేవ్ జీ తదితర కీలక నాయకులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయినప్పటికీ, కీలక మావోయిస్టు నాయకుడు గణపతి మాత్రం ఇప్పటి వరకు లొంగిపోలేదు.