తెలంగాణ రాజకీయాల్లో మరో కమ్యూనిస్టు దిగ్గజం కన్నుమూశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన సీనియర్ కమ్యూనిస్ట్ నాయకుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు (91) కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని నింపింది. 1989, 1994 ఎన్నికల్లో సీపీఎం తరపున వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన, అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గళమెత్తిన నిబద్ధత కలిగిన నేతగా గుర్తింపు పొందారు.
సామాన్య కుటుంబంలో జన్మించిన రాములు రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా పనిచేసినప్పటికీ తన జీవితాంతం ఒక సామాన్యుడిగానే గడపడం విశేషం. పదవులు అడ్డం పెట్టుకుని ఆస్తులు కూడబెట్టే నేటి కాలంలో, ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజా సేవకే అంకితమైన ఆయన ప్రస్థానం భావితరాలకు ఒక గొప్ప పాఠం. తన నియోజకవర్గ అభివృద్ధి కోసం, ముఖ్యంగా అణగారిన వర్గాల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి మరువలేనిది.
ఆయన మృతి పట్ల అటు రాజకీయ వర్గాలు, ఇటు ఇబ్రహీంపట్నం ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆదర్శవంతమైన విలువలతో కూడిన ఒక నిఖార్సైన ప్రజా నాయకుడిని కోల్పోవడం రాష్ట్రానికి తీరని లోటు. ఆయన కుమారుడు కొండిగారి త్రిలోక్ కుమార్ ప్రస్తుతం మున్సిపల్ కౌన్సిలర్గా కొనసాగుతూ తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.