Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తాలిబన్లకు భారీ షాక్: అఫ్గాన్ అధ్యక్షుడు తానేనన్న అమ్రుల్లా సాలే!

తాలిబన్లకు భారీ షాక్: అఫ్గాన్ అధ్యక్షుడు తానేనన్న అమ్రుల్లా సాలే
-ఇండియా తీర్చి దిద్దిన నాయకుడు సాలె
-అంచలంచలుగా మొదటి ఉపాధ్యక్షుడు అయ్యాడు
-ఇప్పటికి తాలిబాన్లకు వశం కానీ పాంజ్ షీర్ లోయ

తాలిబన్ల ఆక్రమణతో అల్లకల్లోలంగా మారిన అఫ్గానిస్థాన్ లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సాక్ష్యాత్తూ అధ్యక్షుడు అష్రఫ్ ఘని దేశం విడిచి పారిపోవడంతో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, దానికి అంతర్జాతీయ మద్దతు కూడగట్టే పనిలో బిజీగా ఉన్న తాలిబన్లకు అమ్రుల్లా సాలే రూపంలో భారీ షాక్ ఎదురైంది. ఘని కేబినెట్ లో అంతర్గత వ్యవహారాల మంత్రిగా, దేశానికి మొదటి ఉపాధ్యక్షుడిగా పనిచేసిన అమ్రుల్లా సాలే ఇప్పుడు తానే అఫ్గాన్ అధ్యక్షుడినని ప్రకటించుకున్నారు. అంతేకాదు, తాలిబన్లకు తలొగ్గే సవాలే లేదని, ఉగ్రమూకల భరతం పడతానని సాలే శపథం చేశారు. అతను ఇండియా కు అనుకూలమైన నాయకుడు కావడంతో తాజా పరిణామాలు మరింత ఉత్కంఠగా మారాయి.

అమెరికా సైన్యం ఆఫ్ఘన్ నుంచి నిష్క్రమణ తర్వాత వారాల వ్యవధిలోనే మెజార్టీ రాష్ట్రాలను కైవసం చేసుకున్న తాలిబన్ సేనలు.. మొన్న ఆదివారం నాటికి రాజధాని కాబూల్ నగరాన్ని కూడా చెరపట్టారు. తాలిబన్లు కాబూల్ లోకి ప్రవేశించే సమయానికే అధ్యక్షుడు అష్రఫ్ ఘని దేశం విడిచి పారిపోవడంతో వారి పని మరింత సులవైంది. ముల్లా బరాదర్ ను అధ్యక్షుడిగా నియమిస్తూ అఫ్గాన్ లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు.. దోహా(ఖతార్) వేదికగా జరుగుతోన్న చర్చల్లో తమ ప్రభుత్వానికి గుర్తింపు లభించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పక్రియ ముగియడానికి మరో రెండు వారాలు పడుతుందనగా, అఫ్గాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రూల్లా సాలే వ్యూహాత్మకంగా తెరపైకొచ్చి తానే దేశానికి కేర్ టేకర్ అధ్యక్షుడినని ప్రకటించుకున్నారు..

అఫ్గానిస్థాన్ రాజ్యాంగం ప్రకారం పదవిలో ఉన్న అధ్యక్షుడు చనిపోయినా, కనిపించకుండా పోయినా అప్పటికి మొదటి ఉపాధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి చేతికి పరిపాలనా పగ్గాలు వెళతాయి. ఆ నిబంధన ప్రకారం, ఘని నిష్రమణతో దేశానికి తానే కేర్ టేకర్ ప్రెసిడెంట్ అవుతానని అమ్రుల్లా సాలే వాదిస్తున్నారు. ఘనీతోపాటే సాలే కూడా డబ్బు సంచులతో దేశం విడిచి పారిపోయినట్లు ప్రచారం జరగ్గా, మొన్న ఆదివారం నాడే సోషల్ మీడియా వేదికగా తాను దేశంలోనే ఉన్నానని సాలే ప్రకటించారు. అంతేకాదు, తాలిబన్లకు తాను తలవంచే ప్రసక్తే లేదని, టెర్రరిస్టులతో తాను చర్చలు కూడా జరపబోనని, అన్ని వర్గాల మద్దతుతో ప్రభుత్వాన్ని నడుపుతానని ఆయన వెల్లడించారు.

ఘని నిష్రమణతో రాజ్యాంగ బద్ధంగా దేశానికి తానే అధ్యక్షుడినని ప్రకటించుకున్న ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలే.. తాను టెర్రరిస్టులకు తల వంచబోనని, మాతృదేశం అఫ్గాన్ కు ద్రోహం తలపెట్టబోనని, తనను ఆదరించిన లక్షలాది ప్రజలను అసంతృప్తికి గురి చేయబోనని శపథం చేశారు. అఫ్గాన్ లో మళ్లీ తాలిబన్ల రాజ్యం ఏర్పడటానికి పాకిస్తానే కారణమని సాలే ఆరోపించారు. ‘‘దుష్ట పాకిస్తాన్ వల్లే అఫ్గాన్ మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. పాక్ పాపాలు ఇప్పటికే ప్రపంచానికి తెలిసొచ్చాయి”అని సాలే మండిపడ్డారు. అఫ్గాన్ లో తాలిబన్ల రాజ్యాన్ని పున:స్థాపించిన పాకిస్తాన్ పై అంతర్జాతీయంగా కఠిన ఆంక్షలు విధించాలని డిమాండ్ చేస్తూ అఫ్గాన్ పౌరులు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.

ఈ పరిణామంతో..ఇరకాటంలో తాలిబన్లు..

సాలేను చంపితే.. అఫ్గాన్ లో అధికార బదలాయింపు ప్రక్రియకు సన్నాహాలను వేగవంతం చేసిన తాలిబన్లకు అమ్రుల్లా సాలే రూపంలో పెద్ద అడ్డంకి ఎదురైంది. ఇప్పటిదాకా తాలిబన్ల వశంకాని పాంజ్ షీర్ లోయ(కాబూల్ కు ఈశాన్యంగా ఉంటుందీ ప్రాంతం)లో మకాం వేసిన సాలే.. తాలిబన్ వ్యతిరేక శక్తులను ఒక్కతాటిపై తెచ్చేందుకు మంత్రాంగం నడుపుతున్నారు. ప్రధానంగా, తాలిబన్ వ్యతిరేక పోరులో దాదాపు జాతిపిత హోదా కలిగిన అహ్మద్ షా మసౌద్ వారసులతో కలిసి సాలే వ్యూహాలు రచిస్తున్నారు. తాలిబాన్లపై గెరిల్లా యుద్ధం సాగించాలా లేక అంతర్జాతీయ మద్దతుతో నేరుగా పరిపాలన సాగించాలా అనే విషయమై సాలే తన మద్దతుదారులతో లోతైన చర్చలు జరుపుతున్నారు. భారత్ తీర్చి దిద్దిన నేతగా పేరుపొందిన అమ్రుల్లా సాలేను తాలిబన్లు తక్షణమే మట్టుపెట్టడం జరిగేపని కాదు. సాలేను చంపితే, శాంతియుతంగా అధికారాన్ని కైవసం చేసుకోవాలనే తాలిబన్ల ప్రయత్నాలకు విఘాతం ఏర్పడటం ఒక కారణమైతే, అసలు సాలే ఇప్పుడున్న ప్రాంతంలోకి తాలిబన్ సేనలు వెళ్లలేకపోవడం మరో కారణం. పాంజ్ షీర్ లోయకు బయట సాలేను అంతం చేసేందుకు గతంలో తాలిబన్లు చాలా ప్రయత్నాలు చేసినా విఫలమయ్యాయి..

భారత్ తీర్చి దిద్దిన నేత అమ్రుల్లా సాలే.. ఘని ప్రభుత్వంలో అంతర్గత వ్యవహారాల మంత్రిగానే కాకుండా మొదటి ఉపాధ్యక్షుడిగానూ పనిచేసిన అమ్రుల్లా సాలేకు, ప్రస్తుతం అతనికి మద్దతుగా నిలిచిన అహ్మద్ షా మసౌద్ పంరంపరకు భారత్ తో అవినాభావ సంబంధాలున్నాయి. తాలిబన్ వ్యతిరేక గడ్డపై పేరుపొందిన పాంజ్ షీర్ లోయలో జన్మించిన సాలే.. 90వ దశకంలో అక్కడ జరిగిన తాలిబన్ వ్యతిరేక పోరాటంలో పాలుపంచుకున్నాడు. తాలిబన్లకు చుక్కలు చూపించి, వాళ్ల పరిధిని కొంత వరకే నిలువరించగలిగిన లెజెండరీ నేత అహ్మద్ షా మసౌద్ ను తన గురువుగా సాలే చెప్పుకుంటున్నారు. 90లనాటి సంఘర్షణలో అహ్మద్ షా నేతృత్వంలోని పోరాటానికి భారత్ మద్దతు ఇచ్చింది. అమ్రుల్లా సాలేకు భారత ఇంటెలిజెన్స్ సంస్థలే శిక్షణ ఇచ్చాయి. ఒక రకంగా భారత్ తీర్చిదిద్దిన సాలే తర్వాతి కాలంలో అప్గాన్ ప్రభుత్వ ఇంటెలిజెన్స్ చీఫ్ అయ్యారు. ఘని సారధ్యంలోని ప్రభుత్వంలో మంత్రిగా, ఉపాధ్యక్షుడిగా ఎదిగారు. మరిప్పుడు, అఫ్గాన్ కు తానే అధ్యక్షుడినని ప్రకటించుకున్న సాలేకు మద్దతు విషయంలో భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి..

l

Related posts

Watch a Drone ‘Herd’ Cattle Across Open Fields

Drukpadam

టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి స్థానంలో ఎమ్మెల్సీ జంగా?

Drukpadam

డిమాండ్లు సాధించుకోవడంలో విఫలమయ్యాం.. చీకటి ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం: ఏపీటీఎఫ్

Drukpadam

Leave a Comment