తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన వేళ తీవ్ర విషాదాలు చోటుచేసుకున్నాయి. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనే మనస్తాపంతో రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురు విద్యార్థులు తమ ప్రాణాలు తీసుకున్నారు. మెదక్, సూర్యాపేట, ఆదిలాబాద్, మహబూబ్నగర్, హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఈ దారుణ ఘటనలు జరిగాయి.
ఆదివారం ఫలితాలు వెలువడిన తర్వాత ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మెదక్ జిల్లాకు చెందిన చాకలి సాయిరాం (16) రెండు సబ్జెక్టుల్లో, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన జూలపల్లి సౌజన్య (17) రెండు సబ్జెక్టుల్లో, మహబూబ్నగర్కు చెందిన జక్కుల శ్రావణి రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో ఇళ్లలోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సూర్యాపేట జిల్లాకు చెందిన యడ్ల సౌజన్య (16) జువాలజీలో ఫెయిల్ కావడంతో బాత్రూంలో ఉరేసుకుంది. హైదరాబాద్ వారాసిగూడకు చెందిన కోయడ కల్యాణి బేగం (16) నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో, “గుడ్ బై, నా ఇంటర్ రిజల్ట్ చూడొద్దు” అని సోదరుడికి మెసేజ్ పంపి ఆత్మహత్య చేసుకుంది.
ఫెయిలవుతానని ఆత్మహత్య.. ఫస్ట్క్లాస్లో పాస్
ఈ ఘటనల్లో ఓ విద్యార్థి కథనం మరింత హృదయవిదారకంగా ఉంది. ఖమ్మం జిల్లాకు చెందిన గంగదేవుల అక్షంత్ (17) పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఫలితాలు రాకముందే రెండు రోజుల క్రితం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, ఆదివారం విడుదలైన ఫలితాల్లో అతను 347 మార్కులతో ఫస్ట్ క్లాస్లో పాసైనట్లు తేలింది. ఆన్లైన్లో కుమారుడి మార్కులు చూసిన అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.