తెలంగాణ వార్తలు

ఎల్బీనగర్-హయత్‌నగర్ రూట్‌లో డబుల్ డెక్కర్.. ఫ్లైఓవర్‌పైనే మెట్రో!

నగరంలోని అత్యంత రద్దీ మార్గాల్లో ఒకటైన ఎల్బీనగర్-హయత్‌నగర్‌పై ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మార్గంలో మెట్రో రైలు మార్గంతో పాటు ఫ్లైఓవర్‌ను కలిపి ‘డబుల్ డెక్కర్’ విధానంలో నిర్మించాలనే ప్రతిపాదన బలంగా ముందుకు వచ్చింది. ఇప్పటికే మెట్రో కోసం పంపిన డీపీఆర్‌ను పక్కనపెట్టి, ఈ కొత్త ప్రణాళికకే అనుమతి ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్రాన్ని కోరుతున్నారు.

హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ (HMRL) సుమారు ఏడాదిన్నర క్రితం ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్‌ వరకు 7.1 కిలోమీటర్ల మెట్రో మార్గానికి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)ను కేంద్రానికి పంపింది. అయితే, ఇదే మార్గంలో జాతీయ రహదారి-65 విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ (R&B) ఇటీవల ఓ కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. 5.5 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. నాగ్‌పుర్ తరహాలో కింద సాధారణ రహదారి, మొదటి అంతస్తులో మూడు లేన్ల ఫ్లైఓవర్, దానిపైన రెండు వరుసల మెట్రో రైలు మార్గం నిర్మించేలా డిజైన్ రూపొందించింది.

జాతీయ రహదారి-65పై విపరీతమైన రద్దీ, తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో ఈ మార్గాన్ని విస్తరిస్తున్నారు. అయితే, మెట్రో, ఫ్లైఓవర్‌ను వేర్వేరుగా నిర్మిస్తే భవిష్యత్తులో మళ్లీ రోడ్డు విస్తరణ, నిర్మాణ ఇబ్బందులు తప్పవని అధికారులు భావిస్తున్నారు. డబుల్ డెక్కర్ నిర్మాణంతో ఒకేసారి రెండు సమస్యలు పరిష్కారమవుతాయని, బేగంపేటలో మాదిరిగా ఇళ్ల సమీపం నుంచి మెట్రో వెళ్లడం, శబ్ద కాలుష్యం వంటి సమస్యలను నివారించవచ్చని చెబుతున్నారు. సర్వీస్ రోడ్లు కూడా స్తంభాలు లేకుండా సాఫీగా ప్రయాణానికి వీలవుతుందని స్థానికులు ఈ ప్రతిపాదనను స్వాగతిస్తున్నారు.

ప్రస్తుతం ఈ రెండు ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఒకవేళ డబుల్ డెక్కర్ నిర్మాణానికే కేంద్రం ఆమోదం లభిస్తే, HMRL సమర్పించిన పాత మెట్రో డీపీఆర్‌లో మార్పులు చేయడం అనివార్యం కానుంది.

Related posts

ఎన్టీవీ ప్రతినిధులు దొంతు రమేష్, సుధీర్ లకు బెయిల్ మంజూరు

Ram Narayana

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ. 3 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్ సీజ్.. ఇద్దరి అరెస్ట్

Ram Narayana

యాదాద్రిలో లంచం బాగోతం.. ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఈఈ..

Ram Narayana