Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మావోయిస్టు అగ్రనేత ఆర్కే అంత్యక్రియలు అడవుల్లో పూర్తి

  • మావోయిస్టు అగ్రనేత ఆర్కే అంత్యక్రియలు పూర్తి
  • ముగిసిన ఆర్కే శకం … అంత్యక్రియల ఫొటోలు విడుదల
    -`తెలంగాణ సరిహద్దు పామేడు-కొండపల్లి సరిహద్దులో అంత్యక్రియలు
    -`నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు అంత్యక్రియలు పూర్తి
    -`అంత్యక్రియలకు భారీగా హాజరైన మావోయిస్టులు
    -అగ్రనేతలు వచ్చారా ? లేదా ?అనే సమాచారం నిర్దారణ కాలేదు
Maoist top leader RK funerals organized in forest area

 

మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే(65) అనారోగ్యంతో మృతి చెందడం తెలిసిందే. ఆర్కే మృతి విషయాన్ని పోలీసులు ఇటీవల వెల్లడించగా, అనంతరం ఆయన మరణాన్ని మావోయిస్టు పార్టీ నిర్ధారించింది. కాగా, ఆర్కే అంత్యక్రియల తాలూకు ఫొటోలను మావోయిస్టులు విడుదల చేశారు. ఆర్కే అంత్యక్రియలను మావోయిస్టులు అడవుల్లో పూర్తి చేశారు. ఆర్కే భౌతికకాయంపై ఎర్రజెండా ఉంచిన మావోలు నివాళులు అర్పించారు.

తెలంగాణ సరిహద్దులోని పామేడు-కొండపల్లి ప్రాంతంలో ఆర్కే అంత్యక్రియలు మావోయిస్టు లాంఛనాలతో నిన్న మధ్యాహ్నం 2 గంటలకు జరిగినట్టు తెలుస్తోంది. తమ సహచరుడికి తుదివీడ్కోలు పలికేందుకు భారీగా మావోయిస్టులు తరలివచ్చారు. స్థానిక గిరిజనులు కూడా ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు .మావోయిస్టు అగ్రనేతలు వచ్చారా ? లేదా ? అనే విషయం ఇంకా నిర్దారణ కాలేదు.అత్యంత కట్టుదిట్టమైన భద్రతా మధ్య ఆర్కే అంతిమ సంస్కారం పార్టీ పద్ధతుల్లో నిర్వహించినట్లు తెలుస్తుంది.

 

ఆర్కేఅనారోగ్యంతో గత రెండు రోజుల క్రితం మృతి చెందిన విషయం విధితమే. ఆర్కే మృతి చెందిన సమాచారాన్ని రెండవ రోజునే చత్తీష్‌ఘడ్‌ డిజిపి ప్రకటించారు. అయితే మావోయిస్టు పార్టీ నుంచి ఎటువంటి ప్రకటన విడుదల కాకపోవడంతో ఆయన మరణంపై స్పష్టత లేదు. అయితే ఆర్కే మృతి చెందిన సమాచారాన్ని నిర్ధారిస్తూ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్‌ శుక్రవారం సాయంత్రం మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు. దీంతో ఆర్‌కె సుమారు 38 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం ముగింపు పలికినట్లు అయింది .

 

 

ఆర్కే మృతదేహాన్ని బంధువులకు అప్పగిస్తారా? లేక అడవి బిడ్డల మధ్యనే అత్యక్రియలు నిర్వహిస్తారా? అనే ప్రశ్నలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆర్కే అంత్యక్రియలను అడవి బిడ్డల సమక్షంలోనే శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల మధ్య నిర్వహించినట్లు సంబంధిత అంత్యక్రియలకు సంబంధించిన చిత్రాలను శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మావోయిస్టు పార్టీ నాయకులు మీడియాకు విడుదల చేశారు. తెలంగాణా సరిహద్దులోని పామేడు`కొండపల్లి సరిహద్దుల్లో ఆర్కే అంత్యక్రియలను నిర్వహించారు. మావోయిస్టు లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆర్కే మృతదేహంపై ఎర్ర జెండా ఉంచి మావోయిస్టులు నివాళులు అర్పించారు.

గుంటూరు జిల్లా రెంటచింతల మండలం తుమ్మకోట గ్రామానికి చెందిన అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే మాచర్లలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌ (ఆర్‌ఎస్‌యు) కార్యాకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. కొంతకాలం ఉపాధ్యాయుడుగా పనిచేసిన ఆర్కే తన వృత్తిని వదిలి 1983లో పీపుల్స్‌వార్‌ పార్టీలో చేరారు. అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన ఎక్కువ కాలం నల్లమల అడవుల్లోనే ప్రజా ఉద్యమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కార్యదర్శిగానూ, ఎవోబి కార్యదర్శిగానూ ప్రజా ఉద్యమంలో పనిచేసిన ఆయన కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయి ఎదిగారు. ఎవోబి పరిధితోపాటు, నల్లమల ప్రాంతాల్లో చేసిన ప్రజాగెరిల్లా ఉద్యమంలో భాగంగా జరిగిన అనేక సంఘటనల్లో ఆయన కీలకపాత్ర పోషించారు. ఆయనపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆయనను పట్టించిన వారికి సుమారు 92 లక్షల రివార్డును ప్రకటించాయి. రాజ్యం చేసిన నిర్భంధంలో భాగంగా మెరుగైన వైద్యాన్ని అందుకోలేక ప్రజా ఉద్యమంలోనే ఆయన తుది శ్వాస విడిచారు. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఆర్కే అంత్యక్రియల్లో ఎవోబి పరిధిలో ప్రజాఉద్యమంలో భాగస్వాములైన మావోయిస్టులు, ఆదివాసీ బిడ్డలు పెద్ద సంఖ్యలో నివాళులర్పించారని మావోయిస్టు పార్టీ జాతీయ కమిటీ అధికార ప్రతినిధి అభయ్‌ ప్రకటించారు.

Related posts

గ్లోబల్ సమ్మిట్ ద్వారా 125 ఎంవోయూలు కుదుర్చుకోనున్నాం: రజత్ భార్గవ

Drukpadam

తెలంగాణాలో కొలిక్కి రాని పీ ఆర్ సి -ఉద్యోగుల ఎదురుచూపులు

Drukpadam

అధికారిక కార్యక్రమంలో మంత్రికి బదులు ఆయన తమ్ముడు…

Drukpadam

Leave a Comment