సంక్షోభంలో కాంగ్రెస్ .. సోనియా, రాహుల్, ప్రియాంక తమ పదవులకు రాజీనామా?
-రేపు ఢిల్లీలో సీడబ్ల్యూసీ భేటీ
-భేటీలో ముగ్గురు నేతల రాజీనామా చేస్తున్నట్లు ప్రచారం?
-నేషనల్ మీడియాలో కథనాలు
-ఐదు రాష్ట్రాల్లో ఓటమిపై కాంగ్రెస్లో అసంతృప్తి
-నిరసన గళం విప్పిన సీనియర్లు
-సీడబ్ల్యూసీ భేటీకి ఏఐసీసీ ఏర్పాట్లు
జాతీయ మీడియాలో ఇప్పుడో వార్త వైరల్గా మారిపోయింది. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్లో రేపు ఓ కీలక పరిణామం చోటుచేసుకోనుందని ఆ వార్త చెబుతోంది. పార్టీకి తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సోనియా గాంధీతో పాటు పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రాలు తమతమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామాలు చేయనున్నారట. కాంగ్రెస్ పార్టీ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా ఈ వార్తను ఇస్తోంది.
ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ మేర పార్టీ దుస్థితికి కారణమెవరంటూ పార్టీలోని సీనియర్లు అప్పుడే నిరసన గళం విప్పారు. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు పార్టీలో అత్యున్నత నిర్ణాయక విభాగం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశంలోనే సోనియా, రాహుల్, ప్రియాంకలు తమ పదవులకు రాజీనామా చేస్తారని ప్రచారం సాగుతోంది. ఈ వార్తలో ఏ మేర వాస్తవముందో తెలియదు గానీ.. ఇప్పుడు ఈ వార్త దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది.
మిగిలిన ఐదు రాష్ట్రాల విషయాన్ని పక్కనపెడితే.. తన పాలనలో ఉన్న పంజాబ్లో సైతం ఆ పార్టీకి ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఆ పార్టీకి చెందిన సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోగా.. పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ కూడా ఓటమిపాలయ్యారు.
ఇక తాను దాదాపుగా గెంటేసిన మాజీ సీఎం అమరీందర్ సింగ్ కూడా ఓటమిపాలు అయ్యారు. మొత్తంగా కాంగ్రెస్కు చెందిన హేమాహేమీలను పంజాబీలు మట్టి కరిపించారు. ఇక యూపీలో స్వయంగా ప్రియాంకా గాంధీ ప్రచారం చేసినా..రాహుల్, సోనియా గాంధీల నియోజకవర్గాల్లోనూ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు.
అన్నింటా ఓటమి నేపథ్యంలో…ఈ ఓటమికి బాధ్యులు ఎవరు అంటూ పార్టీ సీనియర్లు కాస్తంత గట్టిగానే గళం విప్పారు. వీరిలో కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ స్వరం రీసౌండ్ ఇచ్చింది. ఫలితంగా సీడబ్ల్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. అది కూడా అత్యవసరంగానే. ఆదివారం సీడబ్ల్యూసీ సమావేశం జరగనుందని కాసేపటి క్రితం ఏఐసీసీ నుంచి ఓ ప్రకటన వచ్చింది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగే సీడబ్ల్యూసీ భేటీలో పార్టీ ఓటమికి గల కారణాలపై పార్టీ చర్చించనుంది.