ఢిల్లీలో రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ నిరసన.. పాల్గొన్న రేవంత్ రెడ్డి
పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలపై ఆందోళన
పది రోజుల్లో తొమ్మిది సార్లు పెంచారన్న రాహుల్
దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టామన్న ఖర్గే
పెట్రోల్, డీజిల్ రేట్లు రోజు రోజుకు పెరుగుతుండటంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలవరకు ఆయిల్ రేట్లు పెంచకుండా ఆపి బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు రోజు రేట్లు పెంచుతూ ప్రజలను పిచ్చోళ్లను చేస్తుందనే విమర్శలు ఉన్నాయి. అయినప్పటికీ వాటిని లక్ష్య పెట్టకుండా తనదారి తనదే అన్నట్లుగా రేట్లు పెంచుతుంది. దీనికి తోడు అనేక రాష్ట్రాలు విద్యత్ రేట్లను, బస్సు చార్జీలను పెంచుతూ పేదలపై భారాలు వేస్తున్నాయి. ప్రతిపక్షాలు దీనిపై స్పందించిన ఐక్యంగా ఉద్యమించకపోవడం పాలకపక్షానికి తిరుగులేకుండా పోయింది. ఇష్టానుసారం రేట్లు పెంచుతుండటంతో సామాన్యుడు బతకటమే కష్టంగా మారింది. దీనిపై రాహుల్ గాంధీ ఆధ్వరంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో రాహుల్ తో పాటు రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లిఖార్జున ఖర్గే , లోకసభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజాన్ చౌదరి ,టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పలువురు పార్లమెంట్ సభ్యులు ఇతర నాయకులు పాల్గొన్నారు.
దేశంలో పెరిగిపోతోన్న పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలపై కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ రోజు ఉదయం ఢిల్లీలోని విజయ్ చౌక్ వద్ద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలిపారు. పది రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను తొమ్మిది సార్లు పెంచారని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు. పెరుగుతోన్న ధరలను అదుపులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన అనంతరం ఇంధన ధరలు పెరుగుతాయని తమ పార్టీ నేతలు ముందే చెప్పారని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా తమ పార్టీ దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టిందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు.