‘అగ్నిపథ్’ నిరసనలు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైలుకు నిప్పు
‘అగ్నిపథ్’ పథకంపై దేశంలో పలుచోట్ల నిరసనలు
సికింద్రాబాద్ స్టేషన్ లో ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ కు నిప్పు పెట్టిన ఆందోళనకారులు
ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
అగ్నిపథ్ మంటలు దేశంలోని అన్ని ప్రాంతాలకు పాకాయి. నిన్న బీహార్ లో ప్రారంభమైన ఈ ఆందోళనలు హర్యానా , యూ పీ లోను ఆందోళనలు చేపట్టారు .అగ్నిపథ్ పేరుతొ ఆర్మీ లో తాత్కాలిక రిక్రూట్ మెంట్ పై యువత భగ్గుమంటున్నారు . దీనిపై కేంద్రం వయోపరిమితి పెంచుతూ చర్యలు తీసుకున్నప్పటికీ సమస్య అదికాదని అసలు అగ్నిపథం స్కీమ్ ను ఎత్తి వేయాలని నిరుద్యోగ యువత డిమాండ్ చేస్తున్నది .
త్రివిధ దళాల్లో సైనిక నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘అగ్నిపథ్’ పథకంపై దేశంలో పలు చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నాలుగేళ్ల సర్వీస్ అంటూ కేంద్ర ప్రభుత్వం తమ జీవితాలను నాశనం చేస్తోందని యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆందోళన కార్యక్రమాలు హింసాత్మక రూపు దాలుస్తున్నాయి. పలు చోట్లు ఆందోళనకారులు రైళ్లకు నిప్పు పెట్టారు. వయోపరిమితిని పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న అందోళనలు చల్లారడంలేదు
అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కొందరు యువకులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో రైలు పట్టాలపై పార్సిల్ సామాన్లు వేసి నిప్పుపెట్టారు. సికింద్రాబాద్ నుంచి బయల్దేరే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ రైలుకు నిప్పు పెట్టారు. ఈ ఘటనతో సికింద్రాబాద్ స్టేషన్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆందోళన కారులు నాలుగు రైళ్లకు నిప్పు పెట్టారు. వేలాది మంది యువకులు రైలు పట్టాలపైకి వచ్చి విధ్వంసం సృష్టించారు. దాంతో, సికింద్రాబాద్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరుపుతున్నారు.
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఆందోళనతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రణరంగంగా మారింది. రైల్వే స్టేషన్లోకి చొచ్చుకొచ్చిన వేలాది మంది ఆర్మీ ఉద్యోగ అభ్యర్థులు రైళ్లకు నిప్పుపెట్టి అక్కడి ఆస్తులను ధ్వంసం చేశారు. ఉదయం 8.30 గంటలకు మొదలైన ఆందోళన ఇంకా కొనసాగుతోంది.
తొలుత మొదట మూడు, నాలుగు వందల మంది విద్యార్థులు స్టేషన్ లోకి చొచ్చుకొచ్చారు. ఆ తర్వాత మరింత మంది ఆందోళనకారులు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇంతమంది ఒక్కసారిగా దాడి చేయడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. తమ వస్తువులను రైళ్లలోనే వదిలిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటకు పరుగులు తీశారు.
ఆందోళనకారులను అదుపు చేసేందుకు రైల్వే పోలీసులతో పాటు రాష్ట్ర పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దాంతో, అదనపు బలగాలను స్టేషన్లో మోహరించారు. పట్టాలపైకి వచ్చిన ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేసిన పోలీసులు తర్వాత గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పలువురికి గాయాలైనట్టు సమాచారం.
రైల్వే స్టేషన్లో హింస నేపథ్యంలో శుక్రవారం అన్ని ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.