వైసీపీకి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మంచి మాట ….
-బీజేపీకి వైసీపీ అవసరం ఉంది దీన్ని అనుకూలంగా ఉపయోగించుకోవాలని సూచన
-రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి వైసీపీ మద్దతు అవసరమన్న లక్ష్మీనారాయణ
-ప్రత్యేక హోదాను వైసీపీ డిమాండ్ చేయాలని సలహా
-ముందస్తు ఎన్నికల వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదని వ్యాఖ్య
రాష్ట్రపతి ఎన్నికల్లో ఇతర పార్టీల మద్దతు బీజేపీకి అవసరమని మాజీ ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఇదే క్రమంలో వైసీపీ అవసరం కూడా బీజేపీకి చాలా అవసరమని చెప్పారు. బీజేపీ అవసరం నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదాను వైసీపీ డిమాండ్ చేసే అవకాశం ఉందని అన్నారు. ఈ అవకాశాన్ని వైసీపీ ఉపయోగించుకోవాలని సూచించారు.ఇది జెడి లక్ష్మీనారాయణ వైసీపీ కి చెప్పిన మంచిమాటగా పలువురు పేర్కొంటున్నారు . దేశంలో రాజకీయాలు మారుతున్న ప్రస్తుత పరిస్థితిలో బీజేపీ కూడా రేపు అనేక ఛాలంజ్స్ ఎదుర్కోవాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో జెడి తన మనసులో మాట చెప్పటం గమనార్హం ..
ప్రత్యేక హోదాను సాధించడం కోసం పార్టీలకు అతీతంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని లక్ష్మీనారాయణ చెప్పారు. ముందస్తు ఎన్నికల వల్ల రాష్ట్రానికి ఒరిగే ప్రయోజనం ఏమీ లేదని అన్నారు. ప్రభుత్వాలు తెస్తున్న అప్పులు, చేస్తున్న అభివృద్ధిపై లెక్కలు చెప్పాలని సమాచార హక్కు చట్టం కింద కోరతామని తెలిపారు. యువతకు ఉద్యోగాలను కల్పించడంపై అన్ని పార్టీలు దృష్టి సారించాలని అన్నారు. దేశంలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణంపై చర్చ జరగాలని అన్నారు.