ఖర్గే, థరూర్ గొప్ప స్థాయి కలిగిన వ్యక్తులు… రిమోట్ కంట్రోల్ నియంత్రణ అంటే వారిని అవమానించినట్టే: రాహుల్ గాంధీ
- త్వరలో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు
- బరిలో నిలిచిన ఖర్గే, థరూర్
- ఎవరు గెలిచినా పవర్ సోనియా చేతుల్లోనే అంటూ ప్రచారం
- ఖండించిన రాహుల్
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశి థరూర్ పోటీపడుతున్న సంగతి తెలిసిందే. అయితే, వారిలో ఎవరు గెలిచినా వారికి దక్కే అధికారం నామమాత్రమేనని, రిమోట్ కంట్రోల్ సోనియా చేతుల్లోనే ఉంటుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు.
మల్లికార్జున ఖర్గే, శశి థరూర్ ఇద్దరూ గొప్ప స్థాయి కలిగిన నేతలు అని, ఎంతో అవగాహన, తమకంటూ సొంత దృక్పథం ఉన్న నేతలు అని తెలిపారు. వారిని రిమోట్ కంట్రోల్ తో నియంత్రిస్తారు అనడం సరికాదని, అలా అంటే వారిని అవమానించినట్టేనని అన్నారు. అలా ఎన్నటికీ జరగదని, వారిలో ఎవరు గెలిచినా పూర్తి అధికారాలతో పనిచేస్తారని వెల్లడించారు.
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఈ నెల 17న పోలింగ్ జరగనుంది. 19న ఫలితాలు వెల్లడి కానున్నాయి. కాంగ్రెస్ ఎన్నికల బరిలో ఖర్గే, థరూర్ మాత్రమే మిగిలారు. దాంతో ఎవరు గెలుస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక అనివార్యం!… ఈ నెల 17న పోలింగ్!
- కాంగ్రెస్ అధ్యక్ష బరిలో ఖర్గే, థరూర్
- నేటితో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
- ఈ నెల 17న ఎన్నికలు నిర్వహిస్తామన్న మిస్త్రీ
- 19న ఓట్ల లెక్కింపు. ఆపై విజేతను ప్రకటిస్తామని వెల్లడి

ఈ మేరకు పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ శనివారం పార్టీ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన కీలక ప్రకటన చేశారు. పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు బరిలో నిలిచారని, దీంతో ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ను ఈ నెల 17న నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. పోలింగ్ తర్వాత ఈ నెల 19న ఢిల్లీలో ఓట్ల లెక్కింపును చేపట్టి అదే రోజు విజేతను ప్రకటిస్తామని తెలిపారు.
ఈ నెల 14న ఏపీలోకి రాహుల్ యాత్ర… జోడో యాత్ర మ్యాప్ను డీజీపీకి అందించిన ఏపీసీసీ నేతలు
- డీ హీరేహాళ్ వద్ద ఏపీలోకి ప్రవేశించనున్న రాహుల్ యాత్ర
- ఈ నెల 14 తర్వాత 4 రోజుల పాటు యాత్రకు విరామం
- తిరిగి 18న ప్రారంభం కానున్న యాత్ర
- ఈ నెల 21న ఏపీలో యాత్రను ముగించనున్న నేత

డీ హీరేహాళ్ నుంచి ఏపీలో ప్రారంభం కానున్న రాహుల్ యాత్ర.. ఈ నెల 21 దాకా రాష్ట్రంలోనే కొనసాగనుంది. ఈ నెల 14న జరిగే యాత్ర తర్వాత రాహుల్ తన పాదయాత్రకు 4 రోజుల పాటు విరామం ఇవ్వనున్నారు. ఆ తర్వాత తిరిగి 18న ఏపీలో యాత్రను కొనసాగించనున్న రాహుల్… 21 దాకా ఏపీలోనే యాత్ర సాగిస్తారు. ఈ మేరకు ఏపీసీసీ నేతలు గిడుగు రుద్రరాజు, జేడీ శీలం, రాజీవ్ రతన్లు శనివారం డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కలిసి యాత్ర రూట్మ్యాప్ను అందజేశారు.