Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

కమ్యూనిస్టులు లేకుండా దేశం లేదు…తమ్మినేని

కమ్యూనిస్టులు లేకుండా దేశం లేదు…కష్టాలు, కన్నీళ్లున్నంత కాలం ఎర్రజెండా ఎక్కడికీ పోదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మొన్నటి పార్లమెంట్‌ ఎన్నికల్లో సింగిల్‌ పార్టీగా బీజేపీకి 370 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేదని తెలిపారు. కాంగ్రెస్‌తో సహా లౌకిక, ప్రజాస్వామ్యశక్తులతో ఏర్పడిన ఇండియా కూటమి బీజేపీని నిలువరించి రాజ్యాంగాన్ని రక్షించుకోగలిగిందన్నారు. ఖమ్మం అర్బన్‌ మండల పరిధిలోని ఎర్రబోయిన లింగయ్య స్మారక కొత్తగూడెం గ్రామశాఖ సీపీఐ(ఎం) కార్యాలయ భవన ప్రారంభోత్సవ సభలో తమ్మినేని ప్రసంగించారు. అంతకుముందు గ్రామంలోని 13, 14 డివిజన్‌లలోనిర్వహించిన ర్యాలీలో పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావుతో కలిసి పాల్గొన్నారు. స్థానికంగా మూడు చోట్ల ఏర్పాటు చేసిన సీపీఐ(ఎం) జెండాలను ఆవిష్కరించారు. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం నాయకులు ఎర్రబోయిన గోవింద్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో తమ్మినేని ప్రసంగించారు.

దేశానికి కమ్యూనిస్టు సిద్ధాంతం అవసరం

మతోన్మాద విధానాలను తిప్పికొట్టేందుకు కమ్యూనిస్టు ఉద్యమం ప్రజల్లోకి ఎంత చొచ్చుకుపోతే అంతమంచిదని తమ్మినేని అన్నారు. ఓట్లు, సీట్ల సంఖ్య ఎలా ఉన్నా కమ్యూనిస్టులు లేకుండా దేశం బతికి బట్టకట్టలేదన్నారు. భూమి పంచాలి…కూలీ పెంచాలి…ఎస్సీ, ఎస్టీలు, స్త్రీలకు హక్కులు కల్పించాలని పోరాడేది కమ్యూనిస్టులే అన్నారు. ఎర్రబోయిన లింగయ్య వంటి ఆదర్శ కమ్యూనిస్టు పేరు ఈ భవనానికి పెట్టడం గర్వకారణమన్నారు.

బీజేపీకి బానిసలుగా రాజ్యాంగ సంస్థలు

కాగ్‌, సీబీఐ, ఎలక్షన్‌ కమిషన్‌ వంటి రాజ్యాంగ సంస్థలను బీజేపీ బానిసలుగా మార్చుకుందన్నారు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన సీట్లు వచ్చి ఉంటే లౌకిక, ప్రజాస్వామ్య, కులమతాలకు అతీతంగా అంబేద్కర్‌ రూపొందించిన రాజ్యాంగాన్ని మార్చేదని తెలిపారు. ఇండియా కూటమి దీనికి అడ్డుకట్ట వేసిందన్నారు.ఇదీ ప్రజాస్వామ్యశక్తుల విజయంగా అభివర్ణించారు. ప్రజల బతుకులు మారాలంటే విద్యా, వైద్యం, భూమి, ఉద్యోగ, ఉపాధి అందరికీ లభించాలన్నారు. కుల,మత తేడా లేకుండా అందరూ సమానంగా జీవించేలా చూడటమే కమ్యూనిస్టుల లక్ష్యమన్నారు. పేదల కష్టాలు, కన్నీళ్లు ఉన్నంత కాలం కమ్యూనిస్టులు ఉంటారన్నారు. లింగయ్య మనసంత శుద్ధంగా ఆఫీస్‌ ఉందని కితాబు ఇచ్చారు. పార్టీ ఆఫీస్‌ను ఉపయోగించుకొని ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని కాంక్షించారు.

రైతాంగ ఉద్యమం బలంగా ఉన్న చోట బీజేపీ ఓటమి: నున్నా

రైతాంగ ఉద్యమం ఎక్కడ బలంగా ఉందో అక్కడ బీజేపీ ఓటమి చెందిందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. బీజేపీ పీడ వదలకపోతే దేశానికి భవిష్యత్తు లేదన్నారు. లింగయ్య స్ఫూర్తితో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఇదో పార్టీ కార్యాలయంలాగా కాకుండా ఊరంతా పండుగ వాతావరణం నెలకొందన్నారు. ఎర్రజెండాను కప్పుకుని పోయినవాళ్లే నిజమైన కమ్యూనిస్టులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.విక్రమ్‌, భూక్యా వీరభద్రం, కళ్యాణం వెంకటేశ్వరరావు, చింతలచెర్వు కోటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు యర్రా శ్రీనివాస్‌, ఎస్‌కే మీరాసాహెబ్‌, తుమ్మా విష్ణు, తుషాకుల లింగయ్య, ఎస్‌.నవీన్‌రెడ్డి, బత్తిని ఉపేందర్‌, బోడపట్ల సుదర్శన్‌, కొమ్ము శ్రీను, భూక్యా శ్రీనివాసరావు, సీపీఐ నాయకులు పగడాల మల్లేశ్‌, కార్పొరేటర్లు చామకూరి వెంకన్న, కూరాకుల వలరాజు, వీవీ పాలెం సొసైటీ చైర్మన్‌ రావూరి సైదుబాబు, రైతుసంఘం నాయకులు ఉమ్మినేని కోటయ్య, కాంగ్రెస్‌ నాయకులు చేతుల నాగేశ్వరరావు, బొమ్మిశెట్టి సత్యం, బీఆర్‌ఎస్‌ నాయకులు ఎం.కోటయ్య, పార్టీ గ్రామశాఖ కార్యదర్శి మొద్దినబోయిన మంగయ్య, మొర్రిమేకల అచ్చారావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

నాదే సీటు …కందాల……పోటీ ఖాయం తుమ్మల …పొత్తులో మాదే…తమ్మినేని …

Ram Narayana

గెలుపు నాదే …రూ 400 కే సిలిండర్ …మహిళకు రూ 3 వేల పెన్షన్ …కందాల

Ram Narayana

ఖమ్మం పార్లమెంట్ లో పోలైన ఓట్లు 12 లక్షల 41 వేల 135 …76 .09 శాతం

Ram Narayana

Leave a Comment